హైదరాబాద్: సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో సాగు, తాగునీటి కష్టాలు తీరాయని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వర్గల్ మండలంలో నాచగిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. అనంతరం హరీష్ మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుందన్నారు. మండుటెండలో అక్కా చెల్లె బింద పట్టుకొని బయటకు రావాల్సిన అవసరం లేకుండా నల్ల తిప్పితే నీళ్లు వచ్చేలా చేశామన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ఇలా ఉందా అని హరీష్ ప్రశ్నించారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తాగు నీరు ప్రజలకు అందిచ్చారా? అని అడిగారు. తాగు నీరే కాదు సాగు నీరు ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్కే దక్కుతుందని హరీష్ కొనియాడారు. కరువు కాటకాలు, కరెంట్ కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కెసిఆర్ పాలనతో రైతులు ఉత్సహంగా, సంతోషంగా రైతులు పంటలు పండించుకుంటున్నారన్నారు. ఇవాళ తెలంగాణలో ఎక్కడ తిరిగిన పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయన్నారు. భారత దేశంలో యాసంగి పంటలో 53 లక్షల ఎకరాలు పంట పండుతోందన్నారు. దీంతో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు పాల్గొన్నారు.