లండన్: వేదికగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో మొదట టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో కోహ్లీసేన రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో హనుమ విహారి, అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాకు తుది జట్టులో చోటు కల్పించారు. కాగా, విహారికి ఇదే అరంగేట్ర మ్యాచ్. ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్న 292వ ఆటగాడు విహారి. ఇంగ్లండ్ మాత్రం నాల్గో టెస్టు ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుంది. మరోవైపు ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు, ఓపెనర్ అలిస్టర్ కుక్కు ఇదే చివరి టెస్ట్. ఈ మ్యాచ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు కుక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచుల టెస్టుల సిరీస్ లో భారత్ 3-1 తేడాతో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే.