Wednesday, April 24, 2024

అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ తయారీ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

శంషాబాద్: నకిలీ కరెన్సీ ప్రింటింగ్ చేసి చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను స్పెషల్ ఆపరేషన్ టీం బృందం అదుపులోకి తీసుకుంది. వారి వద్ద నుండి నకిలీ కరెన్సీ ప్రింటింగ్ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. వీరి టార్గెట్ మారుమూల గ్రామాలే. ప్రింటింగ్ చేసిన నకిలీ కరెన్సీ నోట్లను మారుమూల గ్రామాల్లోని కిరాణా, కూరగాయలు, పండ్ల దుకాణాల్లో చలామణి చేస్తుంటారు. విశ్వసనీయ సమాచారం మేరకు నకిలీ కరెన్సీ తయా రు చేస్తున్న ముఠాను ఓ హోటల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి శనివారం శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తన కార్యాలయంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలానికి చెందిన తోమండ్ర రంజిత్ సింగ్, అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామానికి చెందిన మలస్ల మోహన్‌రావులు కలిసి నకిలీ కరెన్సీ తయారు చేసేందుకు పథకం వేశారు.

అయితే కంప్యూటర్‌లో ఫోటోషాప్ అప్లికేషన్లు, ఎక్సెల్ కరెన్సీ పేపర్లు, కలర్ ప్రింటర్, స్కానర్ సేకరించారు. అయితే వాటితో మహాత్మా గాంధీ బొమ్మను, నకిలీ కరెన్సీ డినామినేషన్ లను వీటితో తయారు చేయడం ప్రారంభించారు. 500, 200,100,50 నోట్లే వీరి టార్గెట్. అయితే తయారు చేసిన నకిలీ కరెన్సీని కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చిరు వ్యాపారుల వద్ద చలామణి చేస్తుంటారు. ఈ ఇద్దరు నిందితు లు ఇన్‌స్టాగ్రామ్, టెలిఫోన్ ద్వారా ఏజెంట్లను సంప్రదించి ఆరు లక్షల నకిలీ కరెన్సీకి మూడు లక్షల ఒరిజినల్ కరెన్సీ తీసుకొని వారికి చలామణి చేస్తుంటారు. అయితే సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్‌ఓటి పోలీసులు వారి పై నిఘా పెంచారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్లి వద్ద హోటల్ లో ఉంటూ అక్కడి నుండి కరెన్సీ చలామణి చేస్తున్నారని హోటల్‌పై దాడులు నిర్వహించారు.

హోటల్‌లో ప్రధాన నిందితుడు తోమండ్ర రంజిత్‌సింగ్, మలస్ల మోహన్‌రావులను అదుపులోకి తీసుకుని విచారించగా వీరు చలామణి చేస్తున్న నకిలీ కరెన్సీ బండారం బట్టబయలైంది. నిందితుల వద్ద రూ.8,55,000 నకిలీ కరెన్సీ, రూ.2200 నగదు, తయారుచేసే స్కానర్లు, కం ప్యూటర్లు, ప్రింటర్లు, పేపర్లు, సెల్ ఫోన్లు మొత్తం రూ.11,00,200 విలువ చేసే సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నింధితుడు తోమండ్ర రంజిత్ సింగ్‌పై ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, చౌడవరం పిఎస్‌లో, తూర్పు గోదావరి రామచంద్రపురం పిఎస్‌లో కేసులు ఉన్నట్లు డిసిపి నారాయణరెడ్డి తెలిపారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News