నేడు, రేపు, ఎల్లుండి నామినేషన్లు
గ్రేటర్లో డిసెంబర్ 1న పోలింగ్, 4న కౌంటింగ్
బ్యాలట్ పద్ధతిలోనే జిహెచ్ఎంసి ఎన్నికలు
18-20 వరకు నామినేషన్ల స్వీకరణ
21న పరిశీలన, 22న ఉపసంహరణకు అవకాశం
డిసెంబర్ 3న అవసరమైన కేంద్రాల్లో రీపోలింగ్
మహిళ (జనరల్)కు మేయర్ పదవి
9,248 పోలింగ్ కేంద్రాలు
150 డివిజన్లకు ఆర్ఓలు,అన్ని చోట్ల కౌంటింగ్ సెంటర్లు
30వేల మంది పోలీసులతో బందోబస్తు
బిసి, ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు నామినేషన్ ఫీజు
రూ. 2,500 జనరల్ అభ్యర్థులకు రూ.5వేలు
హైదరాబాద్లో తక్షణం అమల్లోకి ఎన్నికల కోడ్
అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.5లక్షలు
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఇసి పార్థసారథి
వార్డులు ఎవరికెన్ని?
ఎస్సి 02
ఎస్టి 10
బిసి 50
జనరల్ మహిళ 44
జనరల్ 44
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రేటర్ నగరా మోగింది. జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి జిహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జిహెచ్ఎంసి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయని పార్థసారథి తెలిపారు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇతరత్రా టెక్నికల్ అంశాలను పరిగణనలోనికి తీసుకున్న తర్వాత బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2021 ఫిబ్రవరి 10న జిహెచ్ఎంసి పదవీకా లం పూర్తి కానుందన్నారు. జిహెచ్ఎంసిలో వార్డుల వి భజన ఈ ఎన్నికల్లో లేదని వెల్లడించారు. 2016లో నిర్వహించిన వార్డుల మేరకు ఈ దఫా కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు రంగులో బ్యాలెట్ పేపర్లు ఉంటాయన్నారు.
నవంబర్ 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయా వార్డుల్లో ఓటరు జాబితాను ఆయా డివిజన్ల రిటర్నింగ్ అధికారి పబ్లిష్ చేస్తారన్నారు. జిహెచ్ఎంసి నామినేషన్ల దాఖలుకు ఈ నెల 20వ తేదీన చివరి తేదీగా ప్రకటించారు. నవంబర్ 21న నామినేషన్లను పరిశీలించనున్నారు. 22న ఉపసంహరణ చివరి తేదీగా ప్రకటించారు. డిసెంబర్ 1న జిహెచ్ఎంసి పోలింగ్ నిర్వహించనున్నట్లుగా కమిషనర్ పార్థసారథి తెలిపారు. కోవిడ్ దృష్టా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 4వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. అవసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ను నిర్వహించనున్నారు. మేయర్ అభ్యర్థికి జనరల్ మహిళకు రిజర్వ్ చేసినట్టుగా ఆయన చెప్పారు. డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకనుగుణంగా ప్రతి వార్డులో అవసరమైన ఏర్పాట్లు చేశామని కమిషనర్ పార్థసారథి వివరించారు. బిసి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నామినేషన్ల ఫీజును రూ.2500 చెల్లించాలి. జనరల్ అభ్యర్థులు రూ.5 వేలు చెల్లించాలని ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ప్రకటించారు.
నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి రిటర్నింగ్ అధికారితో పాటు మరో ముగ్గురు సిబ్బందిని నియమించామన్నారు. వారిలో ఒక మహిళా సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దాదాపుగా 55 వేల మంది పోలింగ్ సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల కోసం 9248 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సంఖ్యపై ఈ నెల 21న స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో సెన్సిటివ్ 1439 (532 లోకేషన్స్లో),హైపర్ సెన్సిటివ్ 1004(308 లోకేషన్స్లో), క్రిటికల్ 257 (73 లొకేషన్లలో).. మొత్తంగా 913 లోకేషన్లలో 2700 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఓటరు స్లిప్ను పార్టీ గుర్తు లేకుండా ఓటర్లకు ఇచ్చేందుకు అవకాశం కల్పించామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు వీలుగా 25 వేల నుంచి 30 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. 356 రూట్ మొబైల్ పార్టీలు, 131 స్ట్రైకింగ్ ఫోర్సెస్, 44 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ నిరంతరం పనిచేస్తాయన్నారు. పోలింగ్కు 48 గంటల ముందు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని కమిషనర్ పార్థసారథి వివరించారు. ప్రతి పోలింగ్ బూత్లో నలుగురు సిబ్బంది ఉంటారని కమిషనర్ తెలిపారు.
ఖర్చు చూపకపోతే అనర్హత వేటు
గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు పరిమితి రూ.5 లక్షలు మాత్రమే. 45 రోజుల లోపు అభ్యర్థి ఖర్చుల వివరాలను ఈసికి సమర్పించాలి. తప్పుడు వివరాలు సమర్పిస్తే అభ్యర్థిని మూడేళ్ల పాటు అనర్హుడిగా ప్రకటించే హక్కు ఎస్ఇసికి ఉందన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలకు దేశవ్యాప్తంగా ప్రాధాన్యత ఉందన్నారు. చట్ట ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని కమిషనర్ పార్థసారథి వెల్లడించారు.
150 మంది ఆర్వోలు, 150 కౌంటింగ్ సెంటర్లు
15ం డివిజన్లకు 150 మంది ఆర్వోలు, 150 కౌంటింగ్ సెంటర్లు ఉంటాయన్నారు. దీంతో డివిజన్ వైజ్గా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 14 కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉండటంతో రిజల్ట్ త్వరితగతిన వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడం, ఇతరత్రా సమస్యలు వస్తున్నాయని చెబుతున్న దృష్టా జిహెచ్ఎంసి ఎన్నికలకు బ్యాలెట్ పద్ధతిలో వెళ్లాలని నిర్ణయించామన్నారు. జనరల్ పర్యవేక్షణ కోసం ఒక్కో జోన్కు ఐఎఎస్ అధికారి సహా మొత్తం ఆరుగురిని నియమిస్తామన్నారు.
ఓటింగ్ శాతం పెంచడంపై దృష్టి సారించాం
2014 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45.29 శాతం, 2009 ఎన్నికల్లో 42.04 శాతం ఓటింగ్ నమోదైందన్నారు. ఈ సందర్భంలో ఈ మారు ఓటింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకు ఎలక్షన్ వాచ్ తదితర సంస్థలతో సమావేశమవుతున్నామని, సెల బిటీస్తో సైతం ఓటుహక్కుపై అవగాహన కల్పించనున్నామన్నారు. కాగా, ఓటు శాతం పెంచేందుకు విద్యార్థులతో ర్యాలీలు నిర్వహిం లనుకున్నామని, కోవిడ్ కారణంగా అది సాధ్యపడలేకపోయిందని పార్థసారథి అన్నారు. ఓటింగ్ శాతం పెంచడంలో ఓటర్లకు అవగాహన కల్పనలో తమతో పాటు మీడియా కూడా విస్తృత ప్రచారం నిర్వహించాలని పార్థసారథి కోరారు.
మొత్తం ఓటర్ల సంఖ్య 74.04 లక్షలు
జిహెచ్ఎంసిలో 74,04,286 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 38,56,770 మంది కాగా, మహిళలు 35,46.847 మంది ఉండగా.. ఇతరులు 669 మంది ఉన్నారు.
అతి పెద్ద డివిజన్ మైలార్దేవ్పల్లి… అతి చిన్న డివిజన్ రామచంద్రాపురం
అతిపెద్ద డివిజన్గా మైలార్దేవ్పల్లిగా రికార్డుల్లోకెక్కింది. ఈ డివిజన్లో 79,290 మంది ఓటర్లున్నారు. అతి చిన్న డివిజన్గా రామచంద్రాపురం రికార్డైంది.
ఈ డివిజన్లో 27,948 మంది ఓటర్లు ఉన్నారు. బన్సీలాల్ పేటలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఫతేనగర్ డివిజన్లో ట్రాన్స్జెండర్లు అధికంగా ఉన్నా రు.
జిహెచ్ఎంసి వార్డు రిజర్వేషన్లు ఇలా
ఎస్టీ 2( జనరల్ 1, మహిళ 1), ఎస్సీ 10(జనరల్ 5, మహిళలు 5), బిసి-50(జనరల్ 25, మహిళలు 25), జనరల్ మహిళ – 44, జనరల్ -44.
ఓటర్ల తుది జాబితా ఈ నెల 13న విడుదల చేశామని కమిషనర్ పార్థసారథి గుర్తు చేశారు. జిహెచ్ఎంసి సహా లోకల్ బాడీ ఎన్నికలకు ప్రత్యేక ఎలక్టోరల్ ఉండదన్నారు. 1.1.2020 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి జిహెచ్ఎంసీలో ఓటు హక్కు కల్పించినట్లు చెప్పారు. మొత్తం 150 వార్డులకు ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఎలక్టోరల్ ఫైనల్ చేసే ముందు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామన్నారు. నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు అని పేర్కొన్నారు. ఆ రోజే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య, వారికి కేటాయించే గుర్తులపై స్పష్టత వస్తుందన్నారు.
ఆన్లైన్లో నామినేషన్ పత్రాలు
నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని కమిషనర్ పార్థసారథి వెల్లడించారు. దీంతోఅభ్యర్థులు గందరగోళానికి గురికారన్నారు.
ఆన్లైన్లో వరద బాధితులకు సాయం చేయొచ్చు
ఆన్లైన్లో వరదబాధితులకు సాయం చేయొచ్చని, ఇది ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని కమిషనర్ పార్థసారథి స్పష్టం చేశారు. ఆర్థిక సాయం బాధితులకు నేరుగా కాకుండా ఖాతాల్లో కూడా వేయొచ్చని సూచించారు.