వరంగల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత షురూ
మంత్రి కెటిఆర్ ఆదేశాలతో దగ్గరుండి పర్యవేక్షిస్తున్న అధికారులు
మన తెలంగాణ/వరంగల్: నగరంలోని పలు నాలాలపై అక్రమ కట్టడాల తొలగింపులు వేగవంతంగా చేయాలని మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని నయీంనగర్, కాకతీయకాలనీ, ములుగురోడ్డు దర్గా జంక్షన్ వద్ద నాలాలపై తొలగిస్తున్న అక్రమ కట్టడాలను కమిషనర్ పమేలా సత్పితి పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ములుగురోడ్డు వద్ద నాలాపై మారుతి షోరూం వెనుక భాగంలో, వెంకటేశ్వర గార్డెన్ వెనుక భాగంలో, ఎల్బి కాలేజీ వద్ద నాలాపై అక్రమ కట్టడాలను తొలగించినట్లు చెప్పారు. అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ సమాంతరంగా అక్రమ కట్టడాల సర్వే చేస్తున్నట్లు తెలిపారు. కాజీపేట దర్గా, క్రిష్టియన్కాలనీల్లో తొలగిస్తున్న శిధిలావస్థ ఇండ్లను కమిషనర్ పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో 911 శిధిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించి, అందులో 411 భవనాలకు యోగ్యత ధ్రువీకరణ జరగగా, 14 మరమ్మత్తులు చేశారని, ఇంకను మిగిలి ఉన్న 491 భవనాల్లో నేటికి 157 భవనాలను తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సిపి నర్సింహరాములు, టిపిబిఒలు తదితరులు పాల్గొన్నారు.
Illegal Constructions Demolition in Warangal due to Floods