Friday, March 29, 2024

గులాబీ పోరుకు ‘సర్వం సిద్ధం’

- Advertisement -
- Advertisement -

India vs Australia first test from today

 

సమరోత్సాహంతో భారత్, ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేటి నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుగులో తొలి టెస్టు

అడిలైడ్: ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ జట్లుగా వెలుగొందుతున్న ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌కు గురువారం తెరలేవనుంది. ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న ఆస్ట్రేలియా సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు సీనియర్, యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా కూడా విజయమే లక్ష్యంగా పోరుకు సిద్ధమైంది. అంతేగాక అడిలైడ్ టెస్టు ఫ్లడ్ లైట్ల వెలుగులోజరుగనుంది. గులాబీ బంతితో జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ టెస్టు చరిత్రలో డేనైట్ మ్యాచ్ ఆడడం ఇది రెండోసారి మాత్రమే. ఇక ఆస్ట్రేలియా ఇప్పటికే ఏడు డేనైట్ టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఆడిన అన్ని డేనైట్ టెస్టుల్లోనూ కంగారూలు జయకేతనం ఎగుర వేశారు. ఇక భారత్ కేవలం ఒక్క డేనైట్ టెస్టు మాత్రమే ఆడింది.

బంగ్లాదేశ్‌తో కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక రెండో డేనైట్ మ్యాచ్‌లో పటిష్టమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. అయితే సొంత గడ్డపై ఆడుతుండడం ఆస్ట్రేలియాకు కాస్త కలిసి వచ్చే అంశంగా మారింది. కానీ, గాయాలు ఆతిథ్య జట్టును వెంటాడుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం వల్ల తొలి టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అంతేగాక యువ ఆటగాళ్లు సీన్ అబాట్, పుకోవిస్కిలు కూడా గాయాలతో జట్టుకు దూరమయ్యారు. కీలక ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

భారీ ఆశలతో..

మరోవైపు టీమిండియా టెస్టు సమరానికి ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యింది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే తుది జట్టును కూడా ప్రకటించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఇటు బ్యాట్స్‌మెన్, అటు బౌలర్లు సత్తా చాటడం జట్టుకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని టీమిండియా తహతహలాడుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే కోహ్లి స్వదేశం వెళ్లిపోనున్నాడు. దీంతో ఆరంభ మ్యాచ్‌లో ఎలాగైన జట్టుకు విజయం అందించాలనే పట్టుదలతో ఉన్నాడు.ఇందులో గెలిస్తే రానున్న మ్యాచుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడే అవకాశం భారత్‌కు ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై ఓడించడం అనుకున్నంత తేలికేం కాదు. కానీ, కోహ్లి, రహానె, విహారి, మయాంక్, పుజారా, పృథ్వీషా, అశ్విన్, సాహా తదితరులతో కూడిన బలమైన బ్యాటింగ్ లైనప్ భారత్‌కు అందుబాటులో ఉంది.

కిందటి సిరీస్‌లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాపై ఈసారి కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. పుజారా రాణిస్తే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న పృథ్వీషాపై అందరి కళ్లు నిలిచాయి. ప్రాక్టీస్ మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించక పోయినా జట్టు యాజమాన్యం మాత్రం పృథ్వీషాపై నమ్మకం ఉంచింది. దీంతో అతనికి ఈ మ్యాచ్ సవాలుగా తయారైంది. అందివచ్చిన అవకాశాన్ని షా ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడనే దానిపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పక తప్పదు. ఇందులో విఫలమైతే మాత్రం తుది జట్టులో మళ్లీ చోటు సంపాదించడం కష్టంగా మారడం ఖాయం. రహానె, విహారి, మయాంక్, కోహ్లిలు కూడా జట్టుకు కీలకంగా మారారు. వీరంత సమష్టిగా రాణిస్తేనే భారీ స్కోరు సాధ్యమవుతోంది. ఇదిలావుండగా అశ్విన్, ఉమేశ్, బుమ్రా, షమిలతో బౌలింగ్ చాలా బలంగా ఉంది. ప్రాక్టీస్ మ్యాచుల్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. బుమ్రా బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు. ఫాస్ట్ బౌలర్లకు సహకరించే పిచ్‌లపై ఉమేశ్, బుమ్రా, షమి త్రయం చెలరేగి పోవడం ఖాయమని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.

ఫేవరెట్‌గా బరిలోకి

కాగా, ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. వార్నర్ వంటి స్టార్ బ్యాట్స్‌మన్ లేకున్నా కంగారూలను తక్కువ అంచన వేయలేం. గాయంతో బాధపడుతున్న సీనియర్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడా లేదా ఇంకా తేలలేదు. స్మిత్ లేకుంటే మాత్రం ఆస్ట్రేలియాకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. కానీ లబూషేన్, జోయ్ బర్న్, హారిస్, కెప్టెన్ టిమ్ పైన్, ట్రావిస్ హెడ్, హెన్రిక్స్, మాథ్యూ వేడ్ తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక మిఛెల్ స్టార్క్, పాటిన్సన్, కమిన్స్, హాజిల్‌వుడ్, లియాన్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం కూడా ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశంగా మారింది. దీంతో కంగారూలే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

జట్ల వివరాలు:

భారత్ తుది జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, బుమ్రా, అశ్విన్, ఉమేశ్, షమి.

ఆస్ట్రేలియా: టిమ్ పైన్ (కెప్టెన్), జో బర్న్, హారిస్, లబూషేన్, స్మిత్, ట్రావిడ్ హెడ్, వేడ్, కామెరూన్ గ్రీన్, కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్, పాటిన్సన్, హెన్రిక్స్, లియాన్, నెసర్, స్వెప్సన్.

ఉదయం 9.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News