Wednesday, May 8, 2024

ఐపిఎల్.. జోరుగా బెట్టింగ్‌ల నిర్వహణ

- Advertisement -
- Advertisement -

IPL betting gang arrested

సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అరెస్టులు
రూ.73,56,026 నగదు స్వాధీనం
ఆన్‌లైన్‌లోనే డబ్బుల వ్యవహారాలు
పంటర్‌ల సాయంతో బెట్టింగ్
విద్యార్థులే టార్గెట్

హైదరాబాద్ : ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండడంతో బెట్టింగ్ రాయుళ్లు జోరుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. గతంలో కూడా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జోరుగా బెట్టింగ్ నిర్వహించడంతో పోలీసులు వారిని అరెస్టు చేస్తున్నారు. ప్రధాన నిందితులు కోట్లాది రూపాయలు సంపాదించేందుకు పంటర్లను నియమించుకుని ఐపిఎల్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సబ్ ఏజెంట్లను, పంటర్లను నియమించుకుని నిర్వహిస్తున్నారు. క్రికెట్ ప్రియులకు ఐపిఎల్‌పై ఉన్న ఆసక్తిని బెట్టింగ్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. బెట్టింగ్‌లో ముఖ్యంగా యువకులు, విద్యార్థులు ఎక్కువగా పాల్గొంటున్నారు. చాలామందికి వద్ద డబ్బులు లేకున్నా బెట్టింగ్ కడుతున్నారు, తర్వాత నిర్వాహకులకు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి కేసులు చాలా వరకు దాడుల వరకు వెళ్లాయి. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని గచ్చిబౌలి, మాదాపూర్, బాచుపల్లి, మియాపూర్, ఎల్‌బి నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 18మంది బెట్టింగ్ నిర్వహకులను అరెస్టు చేయగా, ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

వారి వద్ద నుంచి రూ.42.38లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బి నగర్ పోలీసులు తొమ్మిది మంది పంటర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.31,17,576 నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.100కు రూ.200 ఇస్తామని చెబుతుండడతో చాలామంది యువకులు సులభంగా డబ్బులు సంపాదించవచ్చని బెట్టింగ్ కట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలామంది యువకులు బెట్టింగ్ నిర్వహించి సర్వస్వం కోల్పోయారు. తమ వద్ద ఉన్న డబ్బులనే కాకుండా అప్పు తెచ్చికూడా బెట్టింగ్‌లో పెట్టారు. ఉన్న డబ్బులు పోవడమే కాకుండా అప్పులు కూడా తెచ్చి పెట్టడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. దీంతో చాలామంది యువకులు తమ ఇంట్లో చెప్పుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోయారు. డబ్బుల వసూలు కోసం బెట్టింగ్ నిర్వాహకులు రౌడీలను ఆశ్రయించడంతో చాలామంది పారిపోయారు. ఎలాగైన డబ్బులు ఇవ్వాలని లేకుంటే అంతుచూస్తామని బెదిరించడంతో మరిన్ని అప్పులు చేసి తీర్చారు. కొందరు తల్లిదండ్రులకు విషయం తెలపడంతో వారు ఎలాగోలా తీర్చారు. గత ఐపిఎల్‌లో స్నేహితుడితో బెట్టింగ్ కట్టి డబ్బులు ఇవ్వక పోవడంతో మణికొండకు చెందిన ఎర్రంశెట్టి అరుణ్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు.

బాల్ బాల్‌కు బెట్టింగ్…

టివిల్లో మ్యాచ్‌లను చూస్తు బాల్‌కు ఫోర్, సిక్స్ కొడితే ఇంతా, అవుట్ అయితే ఇంతా అని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపిఎల్‌లో ఎక్కువగా ఇలాగే బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్‌కు జరిగే బెట్టింగ్ వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. నగర వ్యాప్తంగా పంటర్లను నియమించుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కో నిర్వహకుడి కింద 100 నుంచి 300మంది పంటర్లు ఉంటున్నారు. పంటర్లు తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి బెట్టింగ్ కట్టేందుకు యత్నిస్తున్నారు. అంతేకాకుండా డబ్బులు చేతికి ఇవ్వకుండా బ్యాంక్ ఖాతాలను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ ముఠాలపై కన్ను వేసి ఉన్నారు. గతంలో బెట్టింగ్ నిర్వహించిన వారిపై నిఘా పెట్టారు. చాలామంది బెట్టింగ్ నిర్వాహకులు అరెస్టు అయినా కూడా మళ్లీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.

సంపన్నులే టార్గెట్…

బెట్టింగ్ ముఠాలు ఎక్కువగా సంపన్నులను టార్గెట్‌గా చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వారిని ఫోన్ ద్వారా సంప్రదించి వారి బ్యాంక్ ఖాతాలు ఇచ్చి డబ్బులను ఆన్‌లైన్ ద్వారా తీసుకుంటున్నారు. దీంతో ఎవరికి అనుమానం రాదని వారి నమ్మకం. కాకపోతే బెట్టింగ్‌లోకి మధ్యతరగతి యువకులు కూడా వస్తున్నారు. బెట్టింగ్‌లో సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే బ్రమతో వచ్చి అప్పులు చేసి మరీ బెట్టింగ్ కడుతున్నారు. డబ్బులు పోవడంతో ఆర్థికంగా కోలుకోలేకపోతున్నారు. నగరంలోని పబ్బులు, స్టార్ హోటళ్లు ముఖ్యంగా బెట్టింగ్‌కు అడ్డాగా మారుతున్నాయి. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఆయా హోటళ్లు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. మందుతోపాటు క్రికెట్ బెట్టింగ్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. ఇక్కడ పోలీసుల నిఘా కూడా తక్కువగా ఉండడంతో బెట్టింగ్ సులభంగా జరుగుతోంది.

ప్రాణాలను బలిగొంటున్న బెట్టింగ్

బెట్టింగ్ కట్టిన చాలామంది అందులో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొందరిని స్నేహితులే బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని హత్య చేశారు. కొందరు విద్యార్థులు ఇంట్లో వారికి తెలియకుండా బెట్టింగ్ కట్టి డబ్బులు కట్టమని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులు ఎక్కువగా బెట్టింగ్ కడుతున్నారు. ముందగా డబ్బులు ఇవ్వాల్సిన పనిలేకపోవడంతో ఆన్‌లైన్‌లో బెట్టింగ్ కడుతున్నారు. తర్వాత డబ్బులు ఇచ్చేందుకు ఇబ్బందులు ఎదురు కావడంతో అప్పుడు అసలు విషయం అర్ధం చుక్కలు చూస్తున్నారు. బెట్టింగ్ డబ్బులు ఇవ్వని వారిపై నిర్వాహకులు చాలా సార్లు దాడులు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News