Thursday, April 25, 2024

గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కర్నాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ బొందపెట్టిందని మంత్రి కెటిఆర్ విమర్శించారు. కర్నాటకలో రైతులకు ఐదు గంటల కరెంటు ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు అని మండిపడ్డారు. తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో కెటిఆర్ రీకౌంటర్ ఇచ్చారు.  మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం తమదని ప్రశంసించారు. రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన బిఆర్‌ఎస్‌ది అని కొనియాడారు. నమ్మి ఓటేసిన కర్నాటక ప్రజలను నట్టేట్ట ముంచిన పార్టీ కాంగ్రెస్ అని చురకలంటించారు. తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేవారు ఎవరు లేరని, కరప్షన్ కేరాఫ్ కాంగ్రెస్ అని, కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల నిత్యం వేధిస్తారని, ఇక్కడికి వచ్చి నీతి వ్యాక్యాలు చెబుతారా? అని కెటిఆర్ చురకలంటించారు.

దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కోల్డ్‌స్టోరేజీలో పెట్టింది కాంగ్రెస్ కాదా?, అడవి బిడ్డలకు 4.5 లక్షల ఎకరాలు భూమి పంచి బిఆర్‌ఎస్ పట్టాభిషేకం చేసిందని కెటిఆర్ కొనియాడారు. శ్రీకాంతాచారిని బలి తీసుకున్న కాంగ్రెస్‌కు ఆ అమరుడిని పేరెత్తే హక్కు లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యం చేయడంతోనే వంది మంది యువత బలిదానాలు చేసుకోవడంతో కాంగ్రెస్ ప్రముఖ పాత్ర పోషించిందని విమర్శించారు. నిన్న అయినా… నేడు అయినా… రేపు అయినా తెలంగాణ నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిన నాడే తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందని, ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ పిసిసి ఛీప్ రేవంత్ రెడ్డి అని, కాంగ్రెసోళ్లు రిమోట్ పాలన గురించి మాట్లాడితే విడ్డూరంగా ఉందని, రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ అడ్రస్ టెన్ జన్‌పథ్ అని కెటిఆర్ ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో ఉందని, గాంధీభవన్ రిమోట్ గాడ్సే చేతిలో మాడి మసైపోతుందని, రాహుల్ గాంధీ మూడు రోజులు పర్యటనలు చేసిన మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసిన కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News