Thursday, April 25, 2024

మైండ్ గేమ్స్ షురూ!

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో అధినేతల పోటీపై ఆసక్తికర లీకులు ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టేలా సంచలన వ్యాఖ్యలు

కేడర్‌లో నూతనోత్సాహం, విశ్వాసాన్ని నింపే ప్రకటనలు

నోటిఫికేషన్ రాకముందే మూడు ప్రధాన పార్టీల దూకుడు తంత్రం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో గత ఆరు నెలలుగా ఎన్నికల వార్ జరుగుతోంది! మొ న్నటివరకూ ప్రధాన పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో కత్తులు దూసుకున్నాయి. ఎత్తులు పైయెత్తులతో ఊపిరి ఆడనంత బిజీగా పనిచేశాయి. తీరా అ సెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో లోక్ సభ ఎ న్నికలు క్యూ కట్టాయి. దీంతో రాజకీయ పార్టీల కు విరామం లేకుండా పోయింది. తెలంగాణాలో మూడు ప్రధాన పార్టీలకూ లోక్ సభ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజ యం పాలైన బిఆర్‌ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో మె జారిటీ సీట్లు గెలుచుకుని, పోయిన ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. అందులోభాగంగా కేసీఆర్ కూడా పార్లమెంటుకు పోటీ చే యాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆయనతోపాటే కెటిఆర్, హరీశ్ రావు కూడా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతారని తెలుస్తోంది. అగ్రనాయకులు పోటీ చేయడంవల్ల పార్టీ కేడర్ లో నూతనోత్సాహం వస్తుందనీ, పార్టీకి చెందిన మిగిలిన అభ్యర్థులు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారన్నది కేసీఆర్ వ్యూహం. రానున్న లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపించకపోతే, క్యా డర్ నిరుత్సాహ పడటంతోపాటు కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి దూకే ప్రమాదం లేకపోలేదని సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాంగ్రెస్ విషయానికొస్తే, కప్పల తక్కెడలాంటి పార్టీని రేవంత్ తనదైన శైలిలో ఏకతాటిపై నడిపిస్తున్నారు. పార్టీ అధిష్ఠానం వద్దకు వెళ్లినప్పుడల్లా ఉప ముఖ్యమంత్రి భట్టిని వెంటబెట్టుకుని మరీ వెళ్తున్నారు. సహచర మంత్రులకు, ఎ మ్మెల్యేలకూ తగిన ప్రాధాన్యమిస్తూ, పార్టీలో అసమ్మతులకూ, అసంతృప్తులకూ చోటివ్వకుండా చూసుకుంటున్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. పార్టీ ఇచ్చిన హామీలను పట్టాలెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. లో క్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ కు ఎంతో కీలకం. ఈ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించలేకపోతే, పార్టీలో అసమ్మతులు, అలజడులు తప్పకపోవచ్చు.

ఈ ప్రమాదాన్ని గ్రహించిన రేవంత్… పార్టీ అధినేత్రి సోనియాగాంధీని తెలంగాణానుంచి పోటీ చేయించేందుకు పావులు కదుపుతున్నారు. దీనికి సోనియా కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కనబడుతోంది. అదే జరిగితే కాంగ్రెస్ కు ప్లస్ పాయింటేనని చెప్పవచ్చు. క్యాడర్ లోనూ, పార్టీ నాయకుల్లోనూ నూతనోత్సహం వస్తుంది. బీజేపీ కూడా తెలంగాణాలో లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించి ఘోర తప్పిదం చేసిన బీజేపీ, లోక్ సభ ఎన్నికల్లో స్వయంకృతాపరాధాలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న బీజేపీ, ఈసారి మల్కాజ్ గిరి, జహీరాబాద్ స్థానాలపైనా దృష్టి పెట్టింది. రానున్న లోక్ సభ ఎన్నికలకోసం రాజస్థాన్ కు చెందిన సీనియర్ నేత చంద్రశేఖర్ ను తెలంగాణ రాష్ట్ర బిజేపి ప్రధాన కార్యదర్శిగా నియమించింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం వెనుక చంద్రశేఖర్ కృషి ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు మైండ్ గేమ్ కు తెరలేపాయి. ప్రత్యర్థుల ఓటు బ్యాంకును కొల్లగొట్టడమే ధ్యేయంగా ఒకదానిని మించి మరొకటి మైండ్ గేమ్ ఆడుతున్నాయి.
కెసిఆర్ పై బండి విమర్శలు అందుకే!
బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ప్రచారం ఈ రెండు పార్టీలకూ చేసిన నష్టం అంతా ఇంతా కాదు. ఈ అభిప్రాయాన్ని ఓటర్లలోంచి తుడిచిపెట్టకపోతే, లోక్ సభ ఎన్నికల్లోనూ పరాభవం తప్పదు. ఇది గ్రహించిన బిజేపీ మైండ్ గేమ్ కు తెరతీసింది. మొన్నటికి మొన్న ఎంపి బండి సంజయ్ ‘కుట్రలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఈ కోవలోకే వస్తాయి. బీజేపీకి ‘బి’ టీమ్ బీఆర్‌ఎస్ అంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని తిప్పి కొట్టి, తమకూ, బీఆర్‌ఎస్ కూ ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని గట్టిగా చెప్పే ప్రయత్నంలో భాగమే బండి సంజయ్ వ్యాఖ్యలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై కాకుండా, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ పై సంజయ్ విరుచుకుపడటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారనీ, ఏ క్షణాన్నయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలుస్తారని సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పై విరుచుకుపడటం ద్వారా బీఆర్‌ఎస్ తమకు దగ్గర చుట్టం కాదని స్పష్టం చేయడమే బండి సంజయ్ లక్ష్యం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇడి తాజాగా నోటీసులు పంపడం వెనుక కూడా బీజేపీ ఉద్దేశం ఇదేనన్నది కొందరి అభిప్రాయం. ఈసారి కవిత అరెస్టు తప్పదనే అభిప్రాయాన్ని ఓటర్లలో కలిగిస్తే, లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చనేది బిజేపీ ఆలోచన.
కేడర్ కోసమే ‘కూల్చివేత’!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందిన పార్టీ కేడర్ ను కూడగట్టి, లోక్ సభ ఎన్నికల్లో గెలిచే ఉద్దేశంతో బిఆర్‌ఎస్ మైండ్ గేమ్ కు తెరతీసింది. సీనియర్ నేత కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇందులో భాగమే. ‘పార్టీ కార్యకర్తలు ఏడాది ఓపికపడితే మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. సింహం రెండడుగులు వెనక్కి వేసిందంటే అందుకు కారణం, లక్ష్యంపై లంఘించడానికే. కేసీఆర్ కూడా అలాగే తిరిగివస్తారు’ అంటూ పార్టీ కేడర్ ను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. పైగా ఆయన కొన్ని లెక్కలు కూడా చెప్పారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఉన్న 39 సీట్లకు, ఎంఐఎం ఏడు సీట్లు, బిజేపి 8 సీట్లు కలిపితే మొత్తం 54. మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేస్తే, ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదు’ అన్నారాయన. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీని గద్దె దించితే, అప్రతిష్ఠ మూటగట్టుకోవాల్సి ఉంటుందన్న విషయం ఆయనకు తెలియనిది కాదు. పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకే శ్రీహరి ఈ వ్యాఖ్యలు చేశారన్నది సుస్పష్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులైనా కాకముందే కేటీఆర్, హరీశ్ కూడా ఆరోపణలు సంధించడం మొదలుపెట్టారు. నిజానికి, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనేది వారికి తెలియని విషయం కాదు. కానీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో చేతులు కట్టుకుని కూర్చుంటే, కేడర్ మరింత నిరుత్సాహ పడుతుందనేది వారి ఆలోచన. అందుకనే రుణమాఫీ, ఐదు హామీల అమలు వంటి అంశాలపై అధికార పార్టీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
సోనియా పోటీపై సిఎం అంతరంగం
రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. బీఆర్ ఎస్ ను ఓడించి, రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్నట్లే, లోక్ సభలోనూ మెజారిటీ సీట్లు సాధించే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్ పై నువ్వంతంటే నువ్వెంత అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పైగా కేటీఆర్ తనను ఎంతపడితే అంత మాటలంటున్నప్పుడు, తాను కేసీఆర్ ను అంటే తప్పేమిటని ఆయన ఒక ఇంటర్వ్యూలో ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు, తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేయాలని బిఆర్‌ఎస్ ప్రయత్నిస్తే, తాను కూడా తగ్గే ప్రసక్తి ఉండదని స్పష్టంగా చెప్పారాయన. జానారెడ్డిలా తాను మంచివాణ్ని కాననే సంకేతాలు కూడా ఇచ్చారు. తెలంగాణానుంచి సోనియా గాంధీని పోటీ చేయించాలన్నది ఆయన ఆలోచనేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోనియా తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పకముందే, ఆమె తెలంగాణనుంచి పోటీ చేయబోతున్నారన్న లీకులు ఇచ్చి, పార్టీ కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.
ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించారు. రేవంత్ స్వయంగా చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జంట నగరాల్లో కాంగ్రెస్ బోల్తాపడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్ గిరి నియోజకవర్గాలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడకముందే, పార్టీలు ఇంత దూకుడుగా ఉన్నాయి. ఎన్నికలవేడి రాజుకున్నాక, ఈ మైండ్ గేమ్ మరింత తీవ్రతరం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News