Tuesday, April 23, 2024

జనాలను మింగేస్తున్న ఊబకాయం

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు పశ్చిమ దేశాలకే పరిమితమైన ఊబకాయం ఇప్పుడు దిగువ, మధ్య ఆదాయ దేశాలకు విస్తరిస్తోంది. భారత దేశంలో ఇది తీవ్ర సమస్యగా మారుతోంది. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారత్‌లో ఊబకాయుల సంఖ్య పెరిగిపోతోందని, దీన్ని అరికట్టడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకుంటే ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు మనదేశంలో పోషకాహార లోపంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. తక్కువ బరువు సమస్యగా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో ఊబకాయం సమస్యగా పరిణమించింది. ఊబకాయం అధికంగా ఉన్న మొదటి ఐదు దేశాల్లో భారత దేశం ఒకటి. 2016 లో వెలువడిన ఒక నివేదిక ప్రకారం 1.35 కోట్ల మంది భారతీయులు ఊబకాయులుగా ఉన్నారని అంచనా వచ్చింది.

Also Read: కెసిఆర్ కొట్టే మొగోణ్ణి నేనే: రఘునందన్

ఆ సంఖ్య వేగంగా పెరుగుతోందని, దేశం లోని పోషకాహార సమస్యను ఊబకాయం భర్తీ చేసిందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్యసర్వే ప్రకారం సుమారు 23 శాతం పురుషులు, 24 శాతం మహిళల బాడీ మాస్ ఇండెక్స్ 25 లేదా అంతకన్నా ఎక్కువ ఉందని తేలింది. 201516 గణాంకాలతో పోల్చి చూస్తే ఆడ, మగ ఇద్దరిలో ఈ సూచిక 4 శాతం పెరిగింది. అంతే కాకుండా ఐదేళ్ల లోపు వారిలో 3.4 శాతం పిల్లలు అధిక బరువు కలిగి ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. శరీరం బరువును కొలిచేందుకు ఒక ప్రామాణిక సూచిక బాడీ మాస్ ఇండెక్స్ (బిఎంఐ). దీన్ని కొలిచేందుకు బరువు, ఎత్తులను లెక్కలోకి తీసుకుంటారు.

తక్కువ బరువు, సాధారణ బరువు, అధిక బరువు, ఊఐకాయం, ఇలా వర్గీకరించడానికి ఈ సూచిక ఉపయోగపడుతుంది. బిఎంఐ 25 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఊబకాయం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే దక్షిణాసియా వాసులకు ఈ సూచికను కొంత సర్దుబాటు చేయాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని కొలిచిన ప్రతి దశలో ఓ రెండు పాయింట్లు తగ్గించాలి. ఎందుకంటే ఈ ప్రాంతం వారికి పొట్టదగ్గర కొవ్వు సులువుగా పెరుగుతుంది. శరీరంలో మిగతా భాగంలో కొవ్వు పేరుకుపోవడం కన్నా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడం అనారోగ్య సూచిక. అంటే భారతీయులకు 23 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఊబకాయంగా గుర్తించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం శరీరంలో కొవ్వు ఎక్కువైతే క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. 2021లో ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయం కారణంగా 28 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రతి 10 కేజీల అదనపు బరువు , జీవితాన్ని మూడేళ్లు తగ్గించేస్తుంది. అంటే 50 కేజీలు అధిక బరువు ఉంటే 15 ఏళ్లు ఆయుష్షు తగ్గిపోయినట్టు లెక్క వేసుకోవాలి. 20 సంవత్సరాల క్రితం భారత దేశానికి బారియాట్రిక్ శస్త్ర చికిత్స పరిచయం అయింది. బిఎంఐ 40 దాటి ఉండే అత్యంత ప్రమాద స్థితిలో ఉండే వారికి చివరి పరిష్కారంగా ఈ సర్జరీ చేస్తారు. ఊబకాయం వల్ల ఆరోగ్య పరంగానే కాదు, మానసికంగా, సామాజికంగా కూడా సమస్యలు ఉంటాయి. అధిక బరువు లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుందని ఒక సర్వేలో వెల్లడైంది. అది ఆత్మ విశ్వాసం కోల్పోవడం, వివాహాల్లో సమస్యలు , మానసిక వేదన వంటి సమస్యలకు దారి తీసిందని వైద్య నిపుణులు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఊబకాయాన్ని రుగ్మతగా గుర్తించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News