* అధికార పార్టీలోకి భారీగా వలసలు
* సింగరేణి ఎన్నికల్లో గెలిచిన టిఆర్ఎస్
* కాంగ్రెస్లో రెండు గ్రూపులతో సతమతం
* ఆదివాసీల గొడవతో తెరపైకి కాంగ్రెస్ నేతలు
* పోరుబాటతో ప్రజల్లోకి సిపిఐ
* వలసలు, నాయకత్వలోపంతో డీలాపడిన టిడిపి
* అధికార టిఆర్ఎస్లో అంతర్గత కలహాలు
* ప్రజల్లో పట్టుకోసం బిజెపి యత్నాలు
మనతెలంగాణ/మంచిర్యాలప్రతినిధి రసవత్తరంగా మారింది. ఈ ఏడాది ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ అధికార పార్టీలోకి భారీగా వలసలు చేరాయి. కాంగ్రెస్లో రెండు వర్గాలు ఏర్పడి గ్రూపు వివాదాలతో సతమతమవుతున్నారు. జిల్లాలో ఆదివాసీ గొడవల కారణంగా కాంగ్రెస్ నేతలు మళ్లీ తెరపైకి వచ్చారు. గిరిజనులలో సానుకూలత ఏర్పడింది. పోరుబాట పేరుతో సిపిఐ ప్రజల్లోకి వెళ్లింది. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పలు చోట్ల భారీగా బహిరంగ సభలను ఏర్పాటు చేయగా ప్రజల నుంచి ఊహించని విధంగా స్పందన వచ్చింది. అదే విధంగా తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపం, టిఆర్ఎస్, కాంగ్రెస్లోకి భారీగా వలసలు వెళ్లడం వలన పార్టీ డీలాపడిపోయింది. అధికార టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టిబిజికెఎస్ సింగరేణి ఎన్నికల్లో తొమ్మిది డివిజన్లలో గెలుపొందింది. జిల్లాలో మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పదవులు పదిలంగానే ఉన్నాయి. ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు ప్రాతినిత్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మందమర్రి డివిజన్లో టిబిజికెఎస్ ఓటమి పాలు కావడం వలన పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు. ముగ్గురు నాయకులకు నామినేటెడ్ పోస్టులు వరించాయి.
ఇంటింటా టిఆర్ఎస్
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా నియోజకవర్గాల్లోని ఎంఎల్ఏలను స్థానికంగా ఉండి అభివృద్ధి పనులు పర్యవేక్షించాలని, అంతే కాకుండా నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని ఎంఎల్ఏలు వార్డులు, గ్రామాలోల తిరుగుతూ పార్టీని పటిష్టవంతం చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జిల్లాలోని ఎంఎల్ఏలు సిఎం కెసిఆర్ జరిపిన సర్వేలో మంచి మార్కులే సాధించారు. అంతే కాకుండా వేసవి కాలంలో మంచినీటి వసతి, పెరుగన్నం భోజనం లాంటి కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం పొందారు. పలు నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల పేరుతో ఎంఎల్ఏలు ముందుకు సాగుతున్నారు. జిల్లాలో మంత్రులు జోగురామన్న, ఈల్లోల ఇంద్రకరణ్రెడ్డి పలు సందర్భాల్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించి, శంకుస్థాపనలు చేశారు.
కాంగ్రెస్లో వర్గపోరు
జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులు ఏర్పడినాయి. మాజీ ఎంఎల్ఏ అరవిందరెడ్డి, మాజీ ఎంఎల్సి ప్రేమ్సాగర్రావులు వేర్వేరుగా గ్రూపులను ఏర్పాటు చేసుకొని ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు ఇరు వర్గాల వారు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇరువర్గాల మధ్య కాంగ్రెస్ కార్యకర్తలు ఏమి చేయాలో తెలియక వలస బాట పడుతున్నారు. ఈ ఏడాది జరిగిన మాజీ మంత్రి డికె అరుణ కార్యక్రమంలో గ్రూపు తగదాలు రచ్చకెక్కాయి. సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఐఎన్టియుసి, ఎఐటియుసితో జతకట్టి పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ తరుపున టిపిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్రెడ్డి, మాజీ విప్ గండ్ర వెంకట్మ్రణరెడ్డి, మాజీమంత్రి శ్రీధర్బాబు, మాజీ ఎంపి మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రచారం చేయగా మందమర్రి, భూపాల్పల్లి డివిజన్లలో విజయం సాధించారు.
ప్రజామస్యలపై పోరుబాట
ప్రజాసమస్యల పరిష్కారం కోసం సిపిఐ చేపట్టిన పోరుయాత్ర మహాసభలు జిల్లాలో ఘనంగా జరిగాయి. పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, సింగరేణిలో ఓపెన్కాస్టుల రద్దు అనే అంశాలపై చేపట్టిన పోరుబాటలో అశేషంగా జనం పాల్గొన్నారు. సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో సిపిఐ నాయకులు పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీనికి తోడు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పలు ఆందోళనలు చేపట్టారు. సిపిఐతో పాటు సిపిఎం న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కూడా పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని పలు సార్లు కలెక్టరేట్ను ముట్టడించారు.
బీటలు వారిన టిడిపి
జిల్లాలో టిడిపికి బీటలు వారింది. టిడిపి కోటలు కూలిపోయాయి. వరుసగా టిఆర్ఎస్, కాంగ్రెస్లోకి బడా నాయకులు వెళ్లిపోవడంతో ఒంటిరిగా మారింది. కింది స్థాయి కార్య కర్తల నుంచి బడా నాయకుల వరకు వివిధ పార్టీలలో చేరారు. నిన్నటి వరకు టిడిపి జిల్లా అధ్యక్షునిగా కొనసాగిన మాజీ మంత్రి బోడజనార్థన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇతని స్థానంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ శరత్కుమార్కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న టిడిపి కార్యకర్తలు లేక చతికిలపడింది. టిడిపి సీనియర్ నేతలు రాథోడ్మ్రేష్, అరిగెల నాగేశ్వర్రావు లాంటి నాయకులు టిఆర్ఎస్లో చేరడంతో టిడిపి అడ్రస్ లేకుండా పోయింది.
ప్రజల విశ్వాసం పొందలేకపోతున్న బిజెపి
బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికి ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతుంది. ఈ ఏడాది బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను మంచిర్యాలలో నిర్వహించారు. ఈ సభలకు బిజెపి జాతీయ స్థాయి అగ్రనేతలు హాజరైనప్పటికి ప్రజలను ఆకట్టుకోలేకపోయారు. నాయకత్వలోపంతో బిజెపిలోను కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. ఏదిఏమైనా ఈ ఏడాది రాజకీయం రసవత్తరంగా మారింది.