లెక్కించేందుకు సిద్ధమైన పిసిబి
తొలివిడతగా హెచ్ఎండిఎ పరిధిలో ప్రారంభం
వివరాల ఆధారంగా యాక్షన్ ప్లాన్
పూర్తిస్థాయి నివేదికను ఎన్జిటికి సమర్పించనున్న అధికారులు
కాలుష్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో కాలుష్యాన్ని లెక్కించేందుకు పిసిబి(పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) సిద్దమైంది. ఇందుకు తగిన ప్రణాళికలు కూడా తయారు చేసింది. మార్చి చివరి నుంచి ఈ పక్రియ ప్రారంభమవుతుందని పిసిబి అధికారులు వెల్లడించారు. తొలివిడతగా పట్టణాలు, ఆ తర్వాత వివిధ జిల్లాల్లో ఉండే చెరువులను పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. ఇటీవలే ఎన్జిటి(నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) బృందం రాష్ట్రంలో పర్యటించిన సంగతి విధితమే. ఈక్రమంలో వివిధ రకాల కాలుష్యాల లెక్కలను ఎన్జిటి పరిశీలించిన అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశా న్ని ఏర్పాటు చేసి కాలుష్యాన్ని అరికట్టేందుకు కృషి చేయాలని పిసిబికి సూచించింది.
దీంతో కాలుష్యంపై స్పష్టమైన గణాంకాలను లెక్కించి, దాన్ని నియంత్రించేందుకు అధికారులు యాక్షన్ ప్లాన్ను నిర్వహించనున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్యాన్ని లెక్కించేందుకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే గాలి, వాయు, కాలుష్యంపై జిహెచ్ఎంసి, పోలీస్శాఖ సమన్వయంతో చేయాల్సిన కార్యక్రమాలపై రివ్యూమీటింగ్ సైతం నిర్వహించారు. యాక్ష న్ ప్లాన్లో ఒక రిపోర్టును తయారు చేసి ఎన్జిటికి సైతం ఇవ్వనున్నట్లు పిసిబి అధికారులు వెల్లడించారు.
తొలివిడత హెచ్ఎండిఎ పరిధిలో ప్రారంభం
చెరువుల్లో కాలుష్యాన్ని లెక్కించే యాక్షన్ ప్లాన్లో భాగంగా తొలివిడత హెచ్ఎండిఎ పరిధిలో ఉన్న 3132 చెరువులతో పాటు జిహెచ్ఎంసి పరిధిలోని 185 చెరువుల్లో కాలుష్యాన్ని అధికారులు లెక్కించనున్నారు. వీటిలో పిహెచ్, సిఒడి, డిఓ, కోలీఫామ్, టిడిఎస్, బిఒడి, కండాక్టవిటీ, టర్బిడిటిక్రోమియం, సీసం, జింక్, కాపర్ శాతాలను లెక్కించి ఒక రిపోర్టును తయారు చేస్తామని పిసిబి అధికారి మురళి మోహన్ తెలిపారు. మార్చి చివరి నుంచి అన్ని చెరువుల్లో కాలుష్యాన్ని లెక్కిస్తామన్నారు. తదనంతరం కాలుష్య తీవ్రతను బట్టి దాన్ని నియంత్రించేకు చేయాల్సిన అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
డిఒ 4 ఎం.జిలు, బిఒడి 3 ఎం.జిలకు మించకూడదు
కేంద్ర కాలుష్య మండలి నిబంధనల మేరకు డిఒ(నీటిలో కరిగి ఉండే ఆక్సిజన్ పరిమాణం) 4 ఎం.జిలు, బిఒడి(బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) 3 ఎం.జిలకు మించకూడదు. నీటిలో వీటి శాతం పెరిగితే ఆ చెరువులోని నీళ్లన్నీ కాలుష్యమవుతున్నట్లు పరిగణించాల్సివస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో చెరువులన్నీంటిలో వీటి శాతం అధికంగానే ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో యాక్షన్ ప్లాన్లో భాగంగా తొలి రౌండ్లో హుస్సేన్ సాగర్, నాచారం. హిమాయత్సాగర్, మీరాలం ట్యాంక్, లంగర్హౌస్, కూకట్పల్లి తదితర చెరువుల్లో కాలుష్యాన్ని అధికారులు లెక్కించనున్నారు.
ప్రస్తుతం కొన్ని సిటీ చెరువుల్లో నీటి నాణ్యత
చెరువు డి.ఒ కండక్టవిటీ బిఒడి
హుస్సేన్సాగర్ 3.6 1433 16
బండాచెరువు 5.2 1234 16
జీడిమెట్ల 5.6 2092 41
కూకట్పల్లి 3.4 1536 38
పటాన్చెరువు 4.2 2343 27