29, 30 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో వర్షాలు
న్యూఢిల్లీ : ఈనెల 26 నుంచి 30 వరకు దేశం లోని వివిధ ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది. తెలంగాణ, కేరళ, మహే ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో వానలు కురుస్తాయని, పశ్చిమబెంగాల్ గంగా తీర ప్రాంతాల్లో, అండమాన్, నికోబార్ దీవులు, సెంట్రల్ మహారాష్ట్ర, మరట్వాడా, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గుజరాత్, ఒడిశా కోస్తా ప్రాంతాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 27,28 తేదీల్లో ఉత్తరాఖండ్, అసోం, మేఘాలయ, సెంట్రల్ మహారాష్ట్ర, మరట్వాడా, తెలంగాణ, కేరళ, మాహే జమ్ము,కశ్మీర్, లడఖ్, గిల్గిత్బాల్టిస్థాన్, ముజఫర్బాద్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, కొంకణ్, గోవా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములతో వర్షాలు పడవచ్చు. 28 న దక్షిణ కర్ణాటక, ఉత్తర కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. 29న ఇవే ప్రాంతాల్లో గాలీ వానలు కురుస్తాయి. గంటకు 30-40 కిమీ వేగంతో గాలులు వీస్తాయి.