అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో టిడిపి నేతలు శనివారం భేటీ అయ్యారు. విశాఖలో చంద్రబాబును అడ్డుకోవడంపై గవర్నర్ కు టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు. పోలీసులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిచారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మరోవైపు విశాఖ ఘటనపై ఇప్పటికే వైసిపి, టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ సందర్భంగా టిడిపి నేత వర్ల రామయ్య మాట్లాడుతూ… జగన్ సర్కార్ శాంతి భద్రతల విషయంలో విఫలమైందన్నారు. వైసిపి కార్యకర్తలను పోలీసులు ఎందుకు అదుపుచేయలేదని మండిపడ్డారు. పోలీసులు సరిగ్గా విధులు నిర్వహించడం లేదంటూ ఆరోపణలు గుప్పించారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి బాబుపై దాడి చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వానిది రాక్షస పాలన అంటూ టిడిపి నేతలు ఫైర్ అయ్యారు. బాబును అడ్డుకున్న ఘటనలో వైసిపి క్రూరత్వం బయటపడిందని యనమల రామకృష్ణుడు అన్నారు.