Thursday, April 25, 2024

వినాయక వ్రత కథ

- Advertisement -
- Advertisement -

vinayaka chavithi special food items

పూజలో పాల్గొంటున్న వారందరూ అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. ఒకరు చదువుతుండగా, మిగిలినవారు ఈ కథను శ్రద్ధగా వినాలి. ఓరోజు నైమిశారణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం ఆయన శౌనకుడు, ఇతరులకి వినాయకుడి పుట్టుక, చంద్రుణ్ని దర్శిస్తే వచ్చే దోషం, దాని నివారణ గురించి సూత మహాముని శౌనకుడు ఇతర మునులకి చెప్పాడు. పూర్వం ఏనుగు రూపంలో గల గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై గజాసురుని అడిగాడు.“స్వామీ! నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలని నా కోరిక” భక్తులకి తేలికగా ప్రత్యక్షమై, వారి కోరికలని ఇట్లే తీర్చి తన మీదకి తెచ్చుకొనే స్వభావం గల శివుడు గజాసురుడి పొట్టలోకి ప్రవేశించి హాయిగా నివశించసాగాడు.

అక్కడ కైలాసంతో పార్వతీదేవి తన భర్త అయిన శివుడి జాగ తెలియక ఆయన కోసం అన్వేషిస్తూ, ఆయన గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంది. దానితో పార్వతి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ వెళ్లి జరిగింది చెప్పి, ఆయన సహాయం కోరింది. “ఓ మహానుభావా! పూర్వం భస్మాసురుడి నుంచి నువ్వు నా భర్తని రక్షించావు. అలాగే ఇప్పుడు నువ్వు గజాసురుడి బారి నుంచి కూడా అయన్ని విడిపించి రక్షించాలి”శ్రీహరి ఆమెను ఊరడించి చెప్పాడు. “శివుని వాహనమైన నందిని నా దగ్గరకు పంపు నీ కోరిక తీరుస్తాను. గజాసురసంహారానికి గంగిరెద్దుల మేళమే తగినది”
బ్రహ్మ, ఇతర దేవతలందరినీ వెంటనే రావలసిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలకి తలో వాయిద్యం ఇచ్చి, తనూ చిరుగంటలూ సన్నాయిని అందుకుని, వారందరితో గజాసురుడి దగ్గరికి వెళ్లాడు. ఆ ఊళ్లో మనోహరంగా సాగే ఆ గంగిరెద్దు మేళాన్ని గురించి విన్న గజాసురుడు దాన్ని స్వయంగా చూసిఎంతో వినోదించాడు. మేళం పెద్దయిన శ్రీహరితో చెప్పాడు.

“నరుడా! నీకేం కావాలో కోరుకో” “అయ్యా!ఇది శివుడి వాహనమైన నంది. శివుని కోసం వచ్చింది. కాబట్టి దానికి ఆయన్ని చూపించు. తర్వాత మా దారిన మేం వెళతాం” అది వినగానే గజాసురుడు ఉలిక్కిపడ్డాడు. తన పొట్టని చీల్చుకుని కానీ శివుడు బయటికి రాలే డు. వస్తే తనకు మరణం తప్పదు. దివ్యదృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకుని, ఇక తనకి చావు తప్పదని గ్రహించి తన కడుపులోని శివుణ్ని ఇలా కోరాడు.
“స్వామీ! నేను మరణించాక నా తలను మూడు లోకాలలో పూజించేలా చేయి. నా చర్మాన్ని నువ్వు ధరించు” శివుడు అందుకు అంగీకరించగానే, శ్రీహరి నందికి సైగ చేశాడు. నంది తన కొమ్ములతో గజాసురుని కడుపు చీల్చి అతన్ని చంపేసింది. పొట్ట నుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి చెప్పాడు. “పరమశివా! దుర్మార్గులకి ఇలాంటి వరాలు ఇవ్వడం పాముకి పాలు పోయడంతో సమానం సుమా!” బ్రహ్మను, ఇతర దేవతలను, వారి వారి లోకాలకు పంపించేసిన శ్రీహరి కూడా వైకుంఠానికి వె ళ్లిపోయాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు.

వినాయకుని జననం

Vinayaka-chavithi

అతి త్వరలో తన భర్త తిరిగి కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతి ఉత్సాహంగా తలంటు పోసుకోవడానికి తయారయింది. తన ఒంటి మీది సున్నిపిండిని నలిపి తీసి, ఆ నలుగుపిండితో ఓ చిన్నపిల్లవాడి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి చెప్పింది.
“కుమారా! నువ్వు కాపలా ఉండి, లోపలికి ఎవరినీ రానీయకు” ఆ బాలుడు అందుకు ఒప్పుకుని సింహద్వారం వద్దకు వెళ్లాడు. పార్వతి స్నానం ముగించుకుని, అనేక నగలను ధరించి, భర్త కోసం ఆత్రంగా వేచి చూడసాగింది.
కైలాసం చేరుకున్న శివుడు లోపలకు వెళ్లబోతూంటే, పార్వతి కాపుంచిన పిల్లవాడు ఆయన్ని అడ్డగించాడు. శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో ఆ పిల్లవాడి తలను తెక్కోసి లోపలకు వెళ్లాడు. పార్వతి శివుడికి ఎదురెళ్లి, ఆహ్వానించి ఆయనకు కాళ్లు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్లిచ్చి పతివ్రతాధర్మం ప్రకారం పూజించింది. చాలాకాలం తర్వాత కలుసుకున్న వారిద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. వారి సంభాషణలో ద్వారం దగ్గరి బాలుడి ప్రసక్తి వచ్చింది. పార్వతి జరిగింది చెప్పగానే శివుడు విచారిస్తూ చెప్పాడు. “అయ్యో! నేను వాడి తల నరికేశానే?” ఇద్దరూ కొద్దిసేపు బాధపడ్డాక శివుడికి గజాసురుడికిచ్చిన వరం గుర్తుకొచ్చి, ఆ గజాసురుడి తలను తెచ్చి, మర ణించిన ఆ బాలుడికి అతికించి, ప్రాణం పోసి చెప్పాడు. “వత్సా! నీకు గజాననుడు అనే పేరు పెడుతున్నాను” పార్వతి గజాననుడిని ప్రేమగా పెంచుకోసాగింది. గజాననుడు కూడా తన తల్లిదండ్రులతో ప్రేమగా మెలగుతూ పెరగసాగాడు. అనింద్యుడనే ఎలుకను తన వాహనంగా చేసుకుని దాన మీద తిరగసాగాడు.
మరికొంత కాలానికి పార్వతీ పరమేశ్వరులకు ఒక కొడుకు పుట్టాడు. అతడికి ‘కుమారస్వామి’ అనే పేరు పెట్టారు. మహాబలశాలి అయిన కుమారస్వామి నెమలిని తన వాహనంగా చేసుకున్నాడు.

విఘ్నాలకి అధిపతి

ఓ రోజు అనేకమంది దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి, పూజించి చెప్పారు. “స్వామీ! విఘ్నాలతో మా పనులు చాలా చెడిపోతున్నాయి. ఈ విఘ్నాలను శాసించేందుకుగాను మాకో అధిపతిని ఇవ్వండి. ఆయన్ని పూజించి విఘ్నాలు కలుగకుండా చూసుకుంటాము”
తన పిల్లలలో ఒకరికి ఆ ఆధిపత్యాన్ని ఇవ్వాలని శివుడు సంకల్పించాడు. అది తెలిసిన గజాననుడు తండ్రిని అడిగాడు. “నేను పెద్ద కొడుకుని కనుక ఆ ఆధిపత్యము నాకివ్వండి నాన్నగారు” రెండో కొడుకు కుమారస్వామి తండ్రితో చెప్పాడు. “నాన్నగారూ! అన్నయ్య మరుగుజ్జు. అందుచేత అసమర్థుడు, అనర్హుడు అవుతాడు. ఆ ఆధిపత్యం నాకివ్వండి” వారి వాదలను విన్న శివుడు వారితో చిరునవ్వుతో చెప్పాడు. “పిల్లల్లారా! మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదుల్లో స్నానం చేసి నా వద్దకు వస్తారో వారిని అందుకు అర్హులుగా నిర్ణయించి, వారికి ఆ ఆధిపత్యాన్ని ఇస్తాను. వెంటనే బయలుదేరండి”
ఆ మాటలు వినీవినగానే కుమారస్వామి నెమలినెక్కి ఆ పని మీద రివ్వున బయలుదేరాడు. వినాయకుడు తన ఎలుక వంక విచారంగా చూసి తండ్రితో చెప్పాడు. “నాన్నగారూ! ఎలుకనెక్కి వెళ్లి నేను తమ్ముడి కన్నా ముందుగా అన్ని నదుల్లో స్నానం చేసి రాలేను. నేను ఈ పోటీలో గెలిచే ఉపాయం మీరే చెప్పండి”
అప్పుడు శివుడు కొడుకుతో చెప్పాడు. “కుమారా! ఎవరు ఒకసారి నారాయణ మంత్రాన్ని జపిస్తారో వారు మూడు వందల కల్పాల కాలం, పుణ్యనదుల్లో స్నానం చేసిన పుణ్యఫలాన్ని పొందుతారు” “అలా అయితే ఆ మంత్రాన్ని ఉపదేశించండి నాన్నగారూ” ఉత్సాహంగా అడిగాడు గజాననుడు.
తండ్రి ఆ మంత్రోపదేశం చేయగానే గజాననుడు కైలాసంలో అత్యంత భక్తిగా ఆ మంత్రాన్ని స్మరించసాగాడు.——
మొదటగా కుమారస్వామి గంగానదికి వెళ్లగా, అప్పటికే గంగలో స్నానం ముగించి, ఎదురొస్తున్న అన్నయ్య గజాననుడు ఎదురుపడ్డాడు. అతనికి ఆశ్చర్యం వేసింది. కుమారస్వామి మూడుకోట్ల ఏభైలక్షల నదుల్లో స్నానానికి వెళ్లినా మంత్రమహిమ వల్ల గజాననుడు స్నానం చేసి ఎదురు రావడం కుమారస్వామికి కనిపించసాగింది. ఆఖరిస్నానం కూడా పూర్తి చేసి, ఎంతో ఆశ్చర్యంతో కుమారస్వామి కైలాసంలోని తండ్రి దగ్గరకు వెళ్లి పశ్చాత్తాపంతో చె ప్పాడు.
“నాన్నగారూ! అన్నగారి మహిమ తెలియక ఇందాక ఏదేదో మాట్లాడాను. నాకన్నా అన్నయ్యే అన్నివిధాలా సమర్థుడు కనుక గజాననుడినే విఘ్నాలకి అధిపతిని చేయండి” ఆ ప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం వేడుకని జరిపించాడు. అప్పటి నుంచి అంతా విఘ్నేశ్వరుడిగా పిలువబడే గజాననుడిని ఆ రోజు పూజించి, వడపప్పు, పానకం, అరటిపండ్లు, తేనె, పాలు, కొబ్బరి, అతనికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్లు ఇతర పిండివంటలను నైవేద్యంగా పెట్టసాగారు. ఆ భాద్రపద శుద్ధ చవితిన భూలోకంలో తనకు నైవేద్యం పెట్టిన వాటన్నిటినీ సుష్టుగా తిని విఘ్నేశ్వరుడు తన వాహనమైన ఎలుకకి కొన్ని పెట్టి కొన్ని చేతుల్లో తీసుకుని భుక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకి మెల్లిగా కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వంగి నమస్కారం చేయటానికి ప్రయత్నించాడు. అయితే తిన్నవాటితో కడుపు ఉబ్బిన వినాయకుడు నేల మీద బోర్లా పడుకొన్నాడు. పొట్ట మీద నిలిచిన చేతులు భూమికి అందలేదు. బలవంతంగా చేతులను భూమికి ఆనిస్తే, కాళ్లు పైకి లేవసాగాయి. ఇలా సాష్టాంగ నమస్కారం చేయడానికి అవస్థ పడే విఘ్నేశ్వరుడిని చూసిన, శివుడి తలలోని చంద్రుడికి వినోదం కలిగి ఫక్కున నవ్వాడు. రాజదృష్టి సోకితే రాళ్లు కూడా పిండవుతాయంటారు. ఈ సామెత నిజమన్నట్లుగా వినాయకుడి పొట్ట పగిలి అందులోంచి ఉండ్రాళ్లు, కుడుములు బయటకు వచ్చి నేల మీద దొర్లాయి. విఘ్నేశ్వరుడు మరణించాడు. తక్షణం గర్భశోకంలో మునిగిన పార్వతి చంద్రుడి వంక కోపంగా చూసి ఈ విధంగా శపించింది. “దుర్మార్గుడా! నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారంతా నీలాపనిందలతో బాధపడుదురుగాక!”

రుషి పత్నులకు నీలాపనిందలు

సరిగ్గా ఆ రోజు ఆ సమయంలో భూలోకంలో సప్తర్షులు ఓ యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు అగ్నిప్రదక్షిణం చే స్తూండగా, అగ్నిదేవుడు ఆ ఏడుగురి భార్యలను చూసి ప్రేమలో పడ్డాడు. కాని వారిని ఏం చేయలేనివాడై, క్షీణించసాగాడు. ఈ సంగతి గ్రహించిన అగ్నిదేవుడి భార్య అయిన స్వాహా దేవి భర్త కోరికను తీర్చాలనుకుంది. అరుంధతి తప్ప, మిగిలిన ఆరుగురి రూపాలను తన మహత్తుతో ధరించి అగ్నిదేవుడి కోరికను తీర్చింది. ఆ ఆరుగురు మునులు అది చూసి, తమ భార్యల శీలాన్ని శంకించి వాళ్లను వదిలేశారు. పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆ విధంగా చంద్రుణ్ని చూసిన ఆ ఆరుగురు భార్యల మీద, తాము చేయని నేరం వచ్చి పడింది.
ఈ వివాదం శ్రీహరి దృష్టికి వచ్చింది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గ్రహించి, ఆ ఋషుల దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాడు. “పార్వతీదేవి శాపం వల్ల ఇలా జరిగిందని మీరు నా ద్వారా తెలుసుకోగలిగారు. మరి నా సహాయం పొందలేని సామాన్యులకి కూడా మనం మేలు చేయాలి కదా. పదండి”
శ్రీహరి అందరినీ వెంట తీసుకుని కైలాసానికి వెళ్లాడు. కడుపు పగిలి మరణించి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి పార్వతికి సంతోషాన్ని కలిగించాడు. శ్రీహరి వెంట వచ్చిన వారంతా పార్వతిని ఇలా ప్రార్థించారు. “తల్లీ! పార్వతీ! నువ్వు చంద్రుడికి ఇచ్చిన శాపం వల్ల లోకులకు అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి. దయతో ఈ శాపాన్ని ఉపసంహరించి అందరినీ కాపాడు” బ్రతికి వచ్చిన విఘ్నేశ్వరుడిని ముద్దు పెట్టుకుని పార్వతి తృప్తిగా చెప్పింది. “సరే. ఏ రోజున చంద్రుడు మా అబ్బాయి విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజున మాత్రం చంద్రుడిని చూడకూడదు. చూస్తే ఇలాంటి నీలాపనిందలు తప్పవు. మిగిలిన రోజుల్లో చూసినా ఏం కాదు” బ్రహ్మ, ఇతర దేవతలు అది విని సంతోషించి, తమ తమ స్థానాలకు వెళ్లారు. అప్పటినుంచి భాద్రపద మాస శుద్ధ చవితినాడు చంద్రుడిని చూడకుండా ప్రజలు జాగ్రత్తపడుతూ అంతా సుఖంగా జీవించసాగారు. ఇలా కొంతకాలం గడిచింది.

శమంతకోపాఖ్యానం

ఓరోజు శ్రీకృష్ణుడు ద్వారకకు తనని చూడవచ్చిన నారదుణ్ని భక్తిగా పూజించాడు. ఇద్దరూ అనేక విషయాలు ముచ్చటించుకున్నారు. సాయంసంధ్యా సమయంలో నారదుడు లేచి సెలవు తీసుకుంటూ శ్రీకృష్ణుడితో చెప్పాడు. “స్వామీ! ఇవాళ భాద్రపద శుద్ధ చవితి. వినాయకుడి కారణంగా పార్వతి శాపం వల్ల ఇవాళ చంద్రుణ్ని చూడరాదు. చూస్తే నీలాపనిందలు తప్పవు. కాబట్టి వెళ్లొస్తాను. సెలవిప్పించండి” శ్రీకృష్ణుడికి ఆ శాప విషయాలన్నీ వివరించి నారదుడు స్వర్గానికి వెళ్లిపోయాడు. దాంతో శ్రీకృష్ణుడు ఆ రాత్రి చంద్రుణ్ని ఎవరూ చూడరాదని పట్టణంలో చాటింపు వేయించాడు. పాలంటే ఇష్టం కల శ్రీకృష్ణుడు ఆ రాత్రి బయటకు వచ్చి, తలె త్తి ఆకాశం వంక చూడకుండా గోశాలకి పోయి పాలు పితుకుతుంటే, పాల గిన్నెలో చంద్రుడి ప్రతిబింబం కనిపించింది.
“ఆహా! చూడకూడని దినాన చంద్రుణ్ని చూశాను కదా! ఆ శాప ఫలితంగా నాకేం నీలాపనిందలు రానున్నాయో” అనుకున్నాడాయన. ఇలా కొంతకాలం గడిచింది. శ్రీకృష్ణుడి రాజ్యంలో సత్రాజిత్తు అనే అతనుండేవాడు. అతను సూర్యుణ్ని పూజించి, శమంతకమణిని సంపాదించాడు. అతనో రోజు శ్రీకృష్ణుడిని చూడటానికి ద్వారకకు వచ్చాడు. శ్రీకృష్ణుడు అతనికి తగిన మర్యాదలు చేశాక ఆ శమంతకమణి రసక్తి రాగానే కృష్ణుడు దాన్ని తనకిమ్మని సూచించాడు.
“అమ్మో! ఇదిరోజుకి ఎనిమిది బారువుల బంగారాన్ని ఇస్తూంటుంది. ఇంత విలువైన మణిని ఎలా ఇస్తాను?” తిరస్కరించాడు సత్రాజిత్తు.

“సరే నీ ఇష్టం” అన్నాడు కృష్ణుడు.— మరికొంత కాలం గడిచాక సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ శమంతకమణిని మెళ్లో ధరించి, వేటాడటానికి వెళ్లాడు. ఓ సింహం ఆ మణిని చూసి అది మాంసం ముక్క అని పొరబడి ప్రసేనుడి మీదకు ఉరికి చంపేసింది. ఆ మణిని నోట కరచుకునొ వెళ్లే ఆ సింహాన్ని ఓ మగ ఎలుగుబంటి చూసి చంపాడు. ఆ మణితో తన నివాసస్థలానికి వెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆ మణిని ఆడుకోవడానికి ఇచ్చాడు. వేటకు వెళ్లి తిరిగిరాని తమ్ముడి కోసం సత్రాజిత్తు అడవికి మనుషులను పంపితే మణి లేని అతని శరీరం వారికి కనిపించింది. వారంతా వెంటనే వచ్చి ఆ సంగతి చెప్పారు. సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ని చంపి ఆ మణిని దొంగిలించాడని భావించి నగరమంతా చాటింపు వేయించాడు.

ఈ సంగతి శ్రీకృష్ణుడికి తెలిసింది. భాద్రపద శుద్ధ చవితినాడు తను పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూడటం వల్ల వచ్చిన నీలాపనిందగా దాన్ని గుర్తించాడు. బంధుమిత్రులతో వెంటనే శ్రీకృష్ణుడు అడవికి వెళ్లి ప్రసేనుడి శవాన్ని, పక్కనే ఉన్న సింహపు కాలి గుర్తులను చూశాడు. వాటిని అనుసరించి వెళ్తే, అక్కడ చ చ్చి పడి వున్న సింహాని పక్కన గల ఎలుగుబంటి పాదాల గుర్తులను గమనించాడు. ఆ కాలి గుర్తునలు అనుసరించి వెళ్తే, అవి పర్వతంలోని గుహద్వారం దాకా వెళ్లాయి. తన వెంట వచ్చినవారిని అక్కడే వుండమని శ్రీకృష్ణుడు ఒంటరిగా ఆ గుహలోకి వెళ్లాడు. గుహలోని ఊయలకి ఆట వస్తువుగా కట్టి వున్న శమంతకమణిని చూసి, దాన్ని తీసుకుంటూండగా శ్రీకృష్ణుడిని చూసిన జాంబవతి భయపడింది.
“నాన్నా! ఎవరో వింతమనిషి నా మణిని తీసుకుంటున్నాడు చూడు” అని గట్టిగా అరిచింది.

జాంబవంతుడు కోపంతో వచ్చి శ్రీకృష్ణుడిని చూసి, అతని పైబడి కోరలతో కొరుకుతూ, గోళ్లతో గుచ్చుతూ చంపడానికి ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు ఆ ఎలుగుబంటిని కిందకు తోసి రాళ్లతోనూ, వృక్షాలతోనూ, పిడి గుద్దులతోనూ ఎదుర్కొన్నాడు. అలా 28 రోజులపాటు వారి మధ్య యుద్ధం సాగింది. క్రమేపీ జాంబవంతుడి బలం క్షీణించింది. దెబ్బలు తినడం వల్ల అతని దేహమంతా నొప్పులే. తన బలాన్ని క్షీణింపచేయగలిగింది రావణుని చంపిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు జాంబవంతుడు. వెంటనే శ్రీకృష్ణునికి నమస్కారం చేస్తూ, భక్తితో కూడిన వినయంతో చెప్పాడు. “దేవాదిదేవా! నువ్వు త్రేతాయుగంలో రావణుడు, ఇతర దుష్ట రాక్షసులను చంపడానికి అవతరించిన శ్రీరామచంద్రుడవని అర్థమైంది. ఓ సారి నువ్వు నామీద ప్రేమతో ఏదైనా వరం కోరుకోమంటే, బుద్ధిమాలి మీతో ద్వంద్వం యుద్ధం చేయాలని వుందని చె ప్పాను. సమయం వచ్చినప్పుడు అదిజరుగతుందని నువ్వు చెప్పావు. అప్పటినుంచి, అనేక యుగాలుగా నీ నామాన్నే స్మరిస్తూన్నాను. నా ఇంటికే వచ్చి నువ్వు నా కోరికను తీర్చావు. ధన్యుడిని. నా శరీరం అంతా నలిగి బాధగా ఉంది. నువ్వే నన్ను దయతో కాపాడు”

శ్రీకృష్ణుడు జాంబవంతుడి వంక దయగా చూస్తూ తన చేత్తో అతని శరీరాన్ని ఓసారి నిమిరాడు. అంతే! జాంబవంతుడి బాధలన్నీ మాయం అయి పూర్వపు శరీరాన్ని పొందాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తను వచ్చిన పనిని జాంబవంతుడికి వివరించాడు. “జాంబవంతా! నేను శమంతకమణిని దొంగిలించానని నా మీద అభియోగం వచ్చింది. నాకు ఆ మణినిచ్చి నేను ఆ అపనిందను పోగొట్టుకునేలా చెయ్యి” “స్వామీ! అలాగే. ఈ మణేకాక, నా కూతురు జాంబవతిని కూడా నీభార్యగా నీకు సమర్పిస్తాను. దయచేసి స్వీకరించు” కోరాడు జాంబవంతుడు.
అలా జాంబవంతుడికి అల్లుడై, కృష్ణుడు గుహలోంచి మణి, భార్యామణితో బయటికి వచ్చాడు. శ్రీకృష్ణుడికేమైందో అని బయట ఆదుర్డాగా వేచి వున్నవారంతా బాధడుతున్నారు. అతన్ని చూడగానే వారంతా ఆనందంతో జయజయధ్వానాలు చేశారు.

కృష్ణుడు అందరితో కలిసి తన నగరానికి వెళ్లి, సత్రాజిత్తుని పిలిచి, శమంతకమణిని అతనికి ఇచ్చి, ఆ మణి ఎలా మాయమైందో వివరించాడు.
“అయ్యో! లేనిపోని నింద మీమీద మోపి తప్పు చేశాను” అని సత్రాజిత్తు బాధపడ్డాడు. తన తప్పిదానికి పరిహారంగా సత్రాజిత్తు తన కూతురు సత్యభామను శ్రీకృష్ణునికి భార్యగా, ఆ శమంతకమణితో పాటు ఇచ్చాడు. కృష్ణుడు మణిని తిరస్కరించి, సత్యభామను మాత్రం స్వీకరించాడు.
ఓ శుభముహూర్తాన శ్రీకృష్ణుడు, సత్యభామలకు వివాహం జరిగింది. ఆ వివాహానికి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకున్నారు.
“మహాత్మా! మీరు సమర్థులు కాబట్టి చవివిన చంద్రుడిని చూడగా మీ మీద వచ్చిన అపనిందను తొలగించుకోగలిగారు. మాలాంటి అసమర్థుల మాటేమిటి? మీరే తగిన పరిష్కారం చెప్పాలి”
కృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పాడు. మీరు ప్రతి ఏడూ భాద్రపద శుద్ధ చవితినాడు గణపతిని పూజించి, గణపతి పుట్టుక నుంచి, ఈ శమంతకోపాఖ్యానం దాకా మొత్తం కథ విని, లేదా చదివి అక్షింతలు తల మీద చల్లుకుంటే, ఆరాత్రి చంద్రుని చూసినా ఎవరికీ ఎలాంటి నీలాపనిందలూ కలగవు.” ఈ రోజు నుంచి వినాయకుడు విఘ్నాలకు అధిపతియే కాక, గణాలకు కూడా అధిపతి అవుతాడు. కాబట్టి గజాననుడు ఇక నుంచి విఘ్నేశ్వరుడు, గణాధిపతి అనే పేర్లతో కూడా పిలువబడతాడు”
అది విన్న అందరూ సంతోషించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు దేవతలూ, మహర్షులూ, మానవులూ మొదలైనవారంతా తమ శక్తికొలదీ వినాయకుడిని పూజించి ఈ కథ విని లేదా చదివి సుఖంగా వున్నారు.
సూత మహాముని ఆ కథను శౌనకుడు, ఇతర మునులకు చెప్పాక, వారి దగ్గర సెలవు తీసుకుని తన నివాసస్థానానికి వెళ్లాడు.

ఓం విఘ్నేశ్వరాయ నమః

లోకంలోని సమస్త ప్రాణికోటికి శుభం కలుగుగాక.
వినాయక వ్రత కల్పం సమాప్తం

సర్వేజనః సుఖినో భవంతు

చేతిలో వుంచుకున్న అక్షింతలను శిరసున ధరించాలి.

వినాయక నిమజ్జనం

సెప్టెంబర్ 14,15,17,19,23 తేదిల్లో వినాయక నిమజ్జనం చేయవచ్చు. పండుగనాటి సాయంత్రం గణనాథుడికి పానకం, వడపప్పు, పళ్లు నైవేద్యంగా సమర్పించండి. మీ సంప్రదాయాన్ని అనుసరించి …. గణపతిని అదేరోజు సంధ్యాసమయానికి ముందుగా కానీ లేదా 3,5,7,9 వ రోజున కానీ అనంతచతుర్ధి రోజున కానీ కదిలించి మీ ప్రాంతంలోని చెరువు లేదా బావిలో నిమజ్జనం చేయాలి. విగ్రహాన్ని ఇంట్లోనే ఉంచకూడదు. (కొన్ని కుటుంబాలవారికి ఏడాదిపాటు ఇంట్లోనే విగ్రహం పెట్టుకునే ఆచారం కూడా ఉంది) మంగళవారం రోజున నిమజ్జనం చేయకూడదు. నిమజ్జనం చేసే రోజు వరకూ గణపతి ఇంట్లో ఉన్నన్ని రోజులూ మీ శక్తిమేరకు పూజాదికాలు తప్పనిసరిగా చేయండి.

చంద్రదర్శన దోషకాంతి శ్లోకం

విష్ణుపూరాణం ప్రకారం వినాయక చతుర్ధి నాడు చంద్రుని చూసినట్లయితే ఈ క్రింది శ్లోకం చదివితే దోషం తొలగిపోతుందని నిర్ణయ సింధువు చెబుతోంది.
సింహః ప్రసేన మవధీత్ సింహోజాంబవతా హతః
సుకుమారక మారోదీః తవ హ్యేషశ్యమంతకః

Vinayaka Vratam Story

Telangana news

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News