మృతులంతా హుబేయి ప్రావిన్స్ వారే
జపాన్, థాయ్లాండ్, కొరియా, అమెరికా దేశాలకు విస్తరించిన వైరస్
బీజింగ్ : చైనాలో నోవల్ కరోనా వైరస్ మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ వైరస్ బాధితుల సంఖ్య 440 కి చేరింది. చైనా హాలిడే సీజన్ అయినందున కొన్ని కోట్ల మంది చైనాకు రావడం, చైనా నుంచి వెళ్లడం జరుగుతున్నందున ఈ వైరస్ ఇంకా వ్యాపించే ప్రమాదం ఉందని చైనా వైద్య వర్గాలు హెచ్చరించాయి. జ్వరం, దగ్గు,శ్వాస సరిగ్గా ఆడకపోవడం, తదితర లక్షణాలు ఈ వైరస్ సోకినప్పుడు కనిపిస్తాయి. ఈ వైరస్ సోకి 440 నిమోనియా కేసులు బుధవారం నిర్ధారణ అయినట్టు చైనా వైద్య వర్గాలు వెల్లడించాయి.
తొమ్మిది మరణాలు సెంట్రల్ చైనా హుబేయి ప్రావిన్స్ లోనే సంభవించాయని నేషనల్ హెల్తు కమిషన్ డిప్యూటీ డైరక్టర్ లిబిన్ చెప్పారు. ఈ వైరస్ ప్రధానంగా శ్వాసకోశ నాళం ద్వారా సంక్రమిస్తున్నట్టు కనుగొన్నారు. విదేశాలకు సంబంధించి జపాన్లో ఒక కేసు థాయిలాండ్లో మూడు, కొరియాలో ఒక కేసు నమోదయ్యాయి. అమెరికాలో మొదటి కేసు నమోదైంది. దీనికి కారణం చైనా లోని వుహాన్ నుంచి అమెరికా లోని సీటెల్కు జనవరి 15న రావడమే. వుహాన్ కరోనావైరస్ కేంద్రంగా ఉంటోంది. ఇప్పటివరకు మొత్తం 2197 కేసుల్లో 1394 కేసులు వైద్య పరిశీలనలో ఉండగా, 765 మంది డిశ్చార్జి అయ్యారు.