మిషన్ భగీరథలో చేపట్టే కొత్త పనుల కోసం వెయ్యి కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఎవరి పరిధిలో తాగు నీటి సమస్యలు తలెత్తితే వారే భాద్యులవుతారని హెచ్చరించారు. తాగు నీటి సమస్యలు లేకున్నా కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి తప్పుడు ప్రచారాన్ని స్థానిక అధికారులు తిప్పి కొట్టాలని సూచించారు. హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వాయర్లలో నీటి లభ్యత, తాగు నీటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ సెక్రటరి డీఎస్ లోకేష్ కుమార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈలు, డీఈలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పత్రికలో తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు.
ఆ కథనాల్లో నిజమెంతో ఎప్పటికప్పుడు నివేదించాలని స్పష్టం చేశారు. సరిగా తాగు నీటిని సరఫరా చేయకున్నా, తప్పుడు వార్తలను ఖండించకపోయినా చర్యలు తీసుకుంటామని మంత్రి ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వం, అధికారులు వేరు వేరు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రిజర్వాయర్లలో తాగు నీటికి తగినంత నీటి నిలువలు ఉన్నందున గతంలో తాగునీరు అందని గ్రామాలకు కూడా ఈసారి తాగునీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో, ఏజెన్సీ గ్రామాల్లో బోర్లు వేసి తాగు నీరు అందిస్తున్నా పని గట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ అధికారం పోగానే తాగు నీరు రావడం లేదనే దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు. మిషన్ భగీరథలో అప్పటి అధికారులు, సిబ్బందే పనిచేస్తున్నారని చెబుతూ సమస్యలు తలెత్తే పరిస్థితి లేకపోయినా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైనా సాంకేతిక కారణాలతో అవాంతరాలు ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. తాగునీటి అవసరాలకు ఇచ్చేందుకు ప్రతి కలెక్టర్ వద్ద రెండు కోట్ల రూపాయల నిధులను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.
మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్లో 24 గంటల పాటు పని చేసేలా కాల్సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో సమస్యలకు తక్షణం పరిష్కార మార్గం చూపేలా గ్రామాల్లో మంచి నీటి సహాయకులను నియమించిన సంగతి గుర్తు చేశారు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో మిషన్ భగీరథ అధికారులు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. వారితో సమన్వయం చేసుకుంటూ తాగు నీటి సమస్యలు రాకుండా చూడాలని అన్నారు. జాగ్రత్తగా తాగు నీటిని వినియోగించాలని, తాగునీటి సరఫరాలో సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజు ఎనిమిది గంటలోపు మంచి నీటి సరఫరాపై తనకు నివేదిక సమర్పించాలని సూచించారు. ఎక్కడైనా తాగునీటి సమస్యలు తలెత్తితే తీసుకున్న చర్యలనూ నివేదించాలని ఆదేశించారు. వేసవి ముగిసే వరకు నిరంతరంగా సమీక్షలు నిర్వహిస్తానని మంత్రి తెలిపారు.
మిషన్ భగీరథ టోల్ ఫ్రీ సూపర్ సక్సెస్
మిషన్ భగీరథలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ సూపర్ సక్సెస్ అయ్యిందని మంత్రి సీతక్క తెలిపారు. టోల్ ఫ్రీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కాల్ సెంటర్కు అందిన మొత్తం ఫిర్యాదులు -554 ఉన్నాయని తెలిపారు. పట్టణాల్లో నీటి సమస్యపై 120 ఫిర్యాదులు -అందాయని వివరించారు. మిషన్ భగీరథ శాఖకు సంబంధించి 434 ఫిర్యాదులు -వచ్చినట్లు తెలిపారు. మిషన్ భగీరథలో 90 శాతం సమస్యలకు పరిష్కారం చూపినట్లయ్యిందని చెప్పారు. ఈ 434 సమస్యల్లో 389 పరిష్కారమయ్యాయని చెప్పారు. ఇంకా పరిష్కారం కావాల్సినవి 45 ఉన్నాయని తెలిపారు.