Monday, July 1, 2024

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బ్యాదగి తాలూకాలోని గుండెనహల్లి క్రాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఒక లారీని వ్యాను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పిల్లలతోసహా 13 మంది మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. మరణించిన ఇద్దరు మగ పిల్లల వయసు నాలుగేళ్లు, ఆరేళ్లని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. పోలీసుల కథనం ప్రకారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో హవేరీ జిల్లాలోని బ్యాదరీలో నేషనల్ హైవే 48పై రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వ్యాను ఢీకొంది. వ్యానులో మొత్తం 17 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 11 మంది అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

గాయపడిన వారిలో ఇద్దరిని ఆసుపత్రిలోని ఐసియులో ఉంచి చికిత్స అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు. కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఎమెహట్టి గ్రామానికి చెందిన వీరు చించోలి మాయమ్మ దేవస్థానం నుంచి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆ అధికారి తెలిపారు. లారీ హైవే పక్కన నిలిపి ఉందని, వేగంగా వస్తున్న వ్యాను లారీని వెనుక నుంచి ఢీకొందని హవేరీ ఎస్‌పి అన్శు కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. మృతదేహాలను మార్చురీకి తరలించినట్లు ఆయన చెప్పారు. క్షతగాత్రులు హవేరీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. వ్యాను డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News