Tuesday, September 17, 2024

ఏపిలో వర్షాలు, వరదలకు 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, అనంతరం సంభవించిన మునేరు వరదతో విజయవాడ, గుడివాడ, తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంట నష్టం అధికంగా ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు. అన్ని రకాల పంటలు కలిసి 3,79,115 ఎకరాల్లో వ్యవసాయ పంట నష్టం జరిగిందని, మరో 34 వేల ఎకరాల్లో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయని తెలిపింది.

వర్షాలకు 1067.57 కిలో మీటర్లు మేర రోడ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం వరద సహాయ చర్యలుపై స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్స్‌లతో పశువుల వైద్యం అందిస్తున్నామని తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లో జంతు వైద్య శిబిరాల ద్వారా పశువులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతాల్లో బోట్లతో మత్స్యకారుల సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. 163 బోట్లతో 187 మంది మత్స్యకారులు సహాయక చర్యలు చేపట్టారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేశామని తెలిపారు. రైతులను వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా అప్రమత్తం చేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News