ఇప్పటివరకు 87.57 శాతం బియ్యం పంపిణీ
రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: లాక్ డౌన్తో పేదప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన మేరకు నేటి నుంచి పేదల ఖాతాల్లో రూ.1500 చొప్పున ప్రభుత్వం జమ చేయనుందని రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 74లక్షల మందికి పైగాఉన్న పేదల ఖాతాల్లో జమచేసేందుకు బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,112 కోట్ల రూపాయలను బదిలీ చేసిందని కెటిఆర్ వెల్లడించారు. 87.57 శాతం మంది పేదలకు 12 కిలోల చొప్పున రేషన్ బియ్యం పంపిణీ జరిగినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 76 లక్షల 67 వేల187 మంది తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు 3 లక్షల 3వేల 230 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రకటించిన లాక్ డౌన్ లో పేదలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి అనేక చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం
కోవిద్ 19 కరోనా వైరస్ను తరిమి వేసేందుకు అనేక సంస్థలు నూతన ఆవిష్కరణలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రధానంగా కరోనా నియంత్రణ పోరాటంలో ముందువరుసలో నిలుస్తున్న వైద్యసిబ్బంది కోసం ప్రత్యేక ముఖ కవచాలు, మాస్క్లు రూపొందిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ట్రాన్స్క్యాత్ మెడికల్ డివైస్ సంస్థ కరోనా వైరస్ను అడ్డుకునేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కరించిన ఫేస్షీల్డ్ ఉపయోగకరంగా ఉందని రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందించారు. కరోనా నియంత్రణ కోసం ముందువరుసలో నిలబడి వైద్యసేవలు అందిస్తున్నవారికి ఎంతో ఉపయోగకరంగా ఈ ఫేస్షీల్డ్ ఉందని ఆయన పేర్కొన్నారు. కోవిద్ 19 నిర్మూలనకు మరిన్ని ఆవిష్కరణలు జరగాల్సి ఉన్నాయని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో అందుబాటులోకి వస్తున్న నూతన ఆవిష్కరణలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన గుర్తు చేశారు. కరోనా నియంత్రణ కోసం పోరాడుతున్న వైద్యసిబ్బందిని ఆయన ప్రశంసించారు. పారిశుద్ధకార్మికులు చేస్తున్న సేవలు ఎంతో అమూల్యమైనవని ఆయన గుర్తు చేశారు.