Tuesday, September 17, 2024

రుణమాఫీకి 2.25లక్షల మంది రైతుల వివరాలు సేకరణ: మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పంట రుణాలు మాఫీ కాని రైతలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అధికారులు ఇప్పటివరకూ 2.25లక్షల మంది వివరాలను సేకరించారని వ్యవసాయశాఖ మంత్రి తమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం రుణమాఫీపై మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు.రుణమాఫీపైన, రైతుభరోసాపైన ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వంలోలాగా ఒకసారేమో లక్ష రుపాయల రుణమాఫీకే 4 వాయిదాలు తీసుకొని, రెండోసారి 5 వ సంవత్సరములో సగం మందికో రుణమాఫీ చేయలేదన్నారు.

కేసిఆర్ అధికారంలో ఉన్నపుడు అమలు చేసిన వడ్డీమాఫీ పథకాన్ని ప్రస్తావించే ధైర్యం లేక, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీపై అర్థం, పర్థం లేని ఆరోపణలు చేస్తూ, రైతులను ఆందోళనలకు గురి చేస్తున్నారన్నారు. తెలంగాణకి, మరీ ముఖ్యంగా రైతాంగానికి ద్రోహం చేసింది ఎవరో, రుణమాఫీ పేరుతో వంచన చేసింది ఎవరో, ఏ ఊరుకైనా, ఏ గడపకైనా వెళ్లి అడిగి చూడాలని, కనీసం అప్పుడైనా గత నిర్వకాలు తెలుస్తాయన్నారు. ఆ పని ఎలాగు చేయ్యరు కాబట్టి, బిఆర్‌ఎస్‌పార్టీకి సరైన విధంగా కర్రు కాల్చి వాతలు పెట్టినట్లు, గత రెండు ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.

2018 రుణమాఫీ అమలుకు కూడా కుటుంబమే యూనిట్. ఆ కుటుంబ నిర్ధారణకు ప్రాతిపదిక ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ప్రకారం అని చెప్పినప్పటకీ ప్రామాణికంగా తీసుకున్నది రేషన్ కార్డే కదా. ఇది కాదని చెప్పగలరా? కేవలం సగం మందికే ఇచ్చి, 20.84 లక్షల మందికి ఎగ్గొట్టిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. సగం మందికే చేసిన రుణమాఫీలో కూడా 2.26 లక్షల మందికి సంబంధించిన 1419 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు వచ్చినా, వాటిని తిరిగి రైతుల ఖాతాలకు చెల్లించే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. బోడిగుండును, మోకాలికి ముడివేసే పెద్దలు, రుణమాఫీ కాకపోవడానికి 31 కారణాలు అని చెబుతున్నారని, ప్రతి ఒక్కరికి సమాచార పత్రం ఇచ్చి, అందులో కారణం పేర్కొని, వాటిని సరిదిద్దే విధంగా తాము చేస్తున్నామని, బిఆర్‌ఎస్‌లాగా తప్పించుకునే ప్రయత్నం చేయడంలేదన్నారు.

ఒకరిద్దరు రైతులు కాదు, 2018 రుణమాఫీ కాని 20 లక్షల మంది రైతుల పేర్లు ఇవ్వగలం అని తెలిపారు. రుణమాఫీ 2024 పథకం అమలులో ఉన్నది, గత ప్రభుత్వంలోలాగా ఐదేళ్ళు చేయమని, ఈ పంట కాలంలోనే పూర్తి చేస్తామన్నారు. ఆగస్టు 15 కల్లా ఇచ్చిన మాట ప్రకారం సరైన వివరాలు ఉన్న 2 లక్షలలోపు ఉన్న అన్ని ఖాతాలకు రుణమాఫీ వర్తింపచేశామని తెలిపారు.మొదటి పంటకాలంలోనే 22 లక్షల మందికి 18 వేల కోట్లు ఒకే విడతలో మాఫీ చేసామన్నారు. కుటుంబ నిర్ధారణ కాని వాళ్ళని వ్యవసాయాధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 2.65 లక్షల మంది వివరాలు సేకరించినట్టు వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే 26,140.13 కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టినట్టు తెలిపారు.

గత ప్రభుత్వం చెల్లించకుండా బకాయిలు పెట్టిన యాసంగి రైతుబంధు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ, పామాయిల్ రైతులకు చెల్లించాల్సిన ప్రోత్సహకాలు, డ్రిప్ కంపెనీలకు ఇవ్వాల్సిన సబ్సీడీలు కూడా చెల్లించిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. గత రైతుబంధులో 25,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేసారని రైతులలో అభిప్రాయం వ్యక్తం కావడంతో మరింత పకడ్భందిగా పంట వేసినవారికే, కౌలు రైతులకు, సాగులో ఉన్న భూమికే రైతుభరోసా వర్తింపచేయడానికి నిశ్చయించి, విధివిధానాల రూపకల్పన చేస్తున్నట్టు వెల్లడించారు. గత పదేళ్ళలో ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయని పెద్దలు, పది నెలలు కూడా గడవకముందే, మైకులముందుకు వచ్చి గోంతు చించుకోవడం నిజంగా శోచనీయం అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన, ఉప ముఖ్యమంత్రి చెప్పిన ఇంకా మా సహచర మంత్రివర్యులు చెప్పిన తమ అందరిదీ ఒకటే మాట అన్నారు.

100 శాతం రుణమాఫీ అయినట్లు తాము ప్రకటించినట్లు, ఒక విష ప్రచారానికి తెరలేపి రైతులను ఆందోళన పరుస్తున్నది బిఆర్‌ఎస్ నేతలే అన్నారు. ఇప్పటికైనా బుద్దితెచ్చుకొని అసత్య ప్రచారాలు మానుకొని వడ్డీమాఫీ చేయ్యకుండా వదిలేసిన 22లక్షల కుటుంబాల దగ్గరకు వెళ్లి వారికి క్షమాపణ అడిగి పాపాలను ప్రాయశ్చితం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు బిఆర్‌ఎస్ నేతలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News