Sunday, September 8, 2024

రాయిటర్స్ ఫోటోగ్రాఫర్ కు 2024 వరల్డ్ ప్రెస్ ఫోటో అవార్డు

- Advertisement -
- Advertisement -

పారిస్: రాయిటర్స్ ఫొటోగ్రాఫర్ మొహమ్మద్ సలీం గురువారం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 2024 వరల్డ్ ప్రెస్ ఫోటోఅవార్డు పొందారు. పాలస్తీనా మహిళ తన ఐదేళ్ల మేనకోడలి మృతదేహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఊయెల ఊపుతున్న హృదయ విదారక దృశ్యాన్ని సలీం ఫోటోగా క్లిక్ చేయగలిగారు. 36 ఏళ్ల పాలస్తీనా మహిళ అబూ మామర్ తన ఐదేళ్ల మేనకోడలు సలీ మృతదేహాన్ని గుండెలకు హత్తుకుంటా విలపిస్తున్న ఈ దృశ్యం గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధ మారణ కాండకు ప్రత్యక్ష సాక్షం. ఇజ్రాయెల్ క్షిపణి దాడికి ఈ విధంగా ఎన్నో ప్రాణాలు నేల రాలిపోయాయి.

దక్షిణ గాజాలోని ఖాన్ యోనిస్‌లో నస్సీర్ ఆస్పత్రి వద్ద 2023 అక్టోబర్ 17న ఈ సంఘటనను సలీం తన కెమెరాలో బంధించగలిగారు. పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయెల్ బాంబులకు ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల కోసం వారి కుటుంబీకులు వెతుక్కుంటున్న సమయంలో ఈ సంఘటన చిత్రీకరించ గలిగారు. “అనూహ్యమైన ఈ కష్టనష్టాల విపత్తులో మాటలతో చెప్పలేని విషాద సంఘటనను కళ్లకు కట్టినట్టు ఈ ఫోటో ద్వారా ఫోటోగ్రాఫర్ సలీం చాలా శ్రధ్ధ గౌరవాలతో చూపించగలిగారని” న్యాయ నిర్ణేతలు ప్రశంసించారు. గాజా స్ట్రిప్‌లో ఏం జరిగిందో పూర్తి స్వరూపాన్ని ఈ ఫోటో అందిస్తుందని తాను అభిప్రాయపడుతున్నట్టు ఫోటోగ్రాఫర్ సలీం తన అభిప్రాయం వెలిబుచ్చారు.

తమ ఆత్మీయుల విధి ఏవిధంగా ఉందో తెలుసుకోవాలనే ఆత్రుతతో బాధితులు అటూ ఇటూ పరుగెత్తుతుండగా ఈ పాలస్తీనా మహిళ అబూ మాత్రం తన చిన్నారి బాలిక మృతదేహాన్ని ఎత్తుకుని ఉందని, ఎటూ కదలకుండా అక్కడే శోకిస్తుండడం తనకు కనిపించిందని ఫోటో గ్రాఫర్ సలీం ఆనాటి అనుభవాన్ని వివరించారు. ఈ పోటీకి మొత్తం 130 దేశాల నుంచి 3851 ఫోటోగ్రాఫర్లు 61, 062 ఎంట్రీలను పంపారు. స్టోరీ ఆఫ్ ది ఇయర్ కేటగిరిలో సౌతాఫ్రికా జిఇఒ ఫోటోగ్రాఫర్ లీ అన్ ఒల్వాగే గెలుపొందారు. మడగాస్కర్‌లో డిమెన్షియా వ్యాధిగ్రస్తులపై ఒల్వాగే ఇమేజెస్‌తో డాక్యుమెంటరీ రూపొందించారు. లాంగ్ టెర్మ్ ప్రాజెక్టు కేటగిరిలో వెనిజులాకు చెందిన అలెజాండ్రో సిగర్రా గెలుపొందారు. సిగర్రా దిన్యూయార్క్ టైమ్స్ /బ్లూమ్‌బెర్గ్ కోసం ది టువాల్స్ అన్న టైటిల్‌పై సీరీస్ రూపొందించారు.

ఉక్రెయిన్ ఫోటోగ్రాఫర్ జులియా కొచెటోవా ఓపెన్ ఫార్మేట్ అవార్డును సాధించారు. తన దేశంలోసాగుతున్న యుద్ధాన్ని లక్షంగా చేసుకుని ఆమె వార్ ఈజ్ పర్సనల్ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. ్త అమస్టర్‌డామ్ కేంద్రంగా గల వరల్డ్ ప్రెస్ ఫోటో ఫౌండేషన్ ఈ అవార్డులను ప్రకటించింది. రణ సంఘర్షణ ప్రదేశాలలో ప్రమాదాలను ఎదుర్కొన్న జర్నలిస్టులను గుర్తించడం సముచితమని పేర్కొంది. ఇజ్రాయెల్‌హమాస్ యుద్ధంలో సమాచార సేకరణకు వెళ్లిన 99 జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు బలై పోయారని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News