Sunday, July 7, 2024

వాయు కాలుష్యంతో భారత్‌లో ఏటా 33 వేల మరణాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రతీ సంవత్సరం 11.5 శాతం మరణాలు (దాదాపు 12,000 మంది) వాయు కాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్‌లో ప్రచురితమైన ఓ నివేదిక అంచనా వేసింది. కాలుష్యం కారణంగా దేశంలో అత్యధిక మరణాలు సంభవిస్తుందీ ఈ మహా నగరంలోనేనని తెలిపింది.

భారత్ లోని మొత్తం పది నగరాలు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణె, సిమ్లా, వారణాసిలో అధ్యయనం చేశారు. ఏటా ఈ నగరాల్లో దాదాపు 33 వేల మరణాలు వాయుకాలుష్యం కారణంగా సంభవించి ఉండొచ్చని నివేదిక తెలిపింది. సిమ్లాలో అత్యల్పంగా 59 మంది మరణించారు. అక్కడ సంభవిస్తున్న మరణాల్లో ఇది 3.7 శాతానికి సమానం. మొత్తం పది నగరాల్లో నమోదైన మరణాల్లో 7.2 శాతం కాలుష్యం వల్లేనని కుండబద్దలు కొట్టింది. భారత్ సహా విదేశీ పరిశోధకులు కలిసి ఈ అధ్యయనం చేశారు. పది నగరాల్లో పీఎం 2.5 కాలుష్య రేణువుల స్థాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రామాణిక పరిమితులను మించాయని వెల్లడించింది.

సంవత్సరంలో 99.8 శాతం రోజులు ఇదే పరిస్థితి ఉంటోందని తెలిపింది. 2008 నుంచి 2019 మధ్య పది నగరాల్లోని సివిల్ రిజిస్ట్రీల నుంచి మరణాల సమాచారాన్ని సేకరించారు. నగరాన్ని బట్టి మూడు నుంచి ఏడేళ్ల డేటా మాత్రమే వారికి లభించింది. మొత్తం 36 లక్షల మరణాలను అధ్యయనం చేశారు. మెసీన్ లెర్నింగ్ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా పీఎం 2.5 రేణువుల స్థాయిలను అంచనా వేశారు. పీఎం 2.5 స్థాయిలు ప్రతీ క్యూబిక్ మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణాలు 1.42 శాతం అధికమైనట్టు అధ్యయనం గుర్తించింది. పది నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని తెలిపింది. విడివిడిగా గమనిస్తే నగరాల మధ్య వ్యత్యాసం భారీ గానే ఉందని పేర్కొంది.

ఢిల్లీలో మరణాల సంఖ్య 0.31 శాతం పెరిగితే, బెంగళూరులో అది 3.06 శాతం పెరిగినట్టు వెల్లడించింది. సిఎం 2.5 స్థాయిలు పెరిగినప్పుడు కాలుష్యం అధికంగా ఉన్న నగరాలతో పోలిస్తే తక్కువ ఉన్న వాటిల్లోనే మరణాలు అధికమవుతున్నట్టు గుర్తించామని అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల్లో ఒకరైన సెంటర్ ఫర్‌క్రానిక్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన సిద్ధార్థ్ మండల్ వెల్లడించారు. ఇలా వివిధ నగరాల్లో స్వల్పకాలంలో కాలుష్య ప్రభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేయడం భారత్‌లో ఇదే తొలిసారి అని మరో పరిశోధకుడు భార్గవ్ కృష్ణ తెలిపారు. భారతీయుల ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావానికి సంబంధించి కీలక విషయాలు దీంతో వెల్లడైనట్టు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News