Tuesday, September 17, 2024

త్వరలో 35,000 కొలువులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని, గ్రూ ప్-1, గ్రూప్-2, గ్రూప్3, డిఎస్‌సితో కలిపి మ రో 35 వేల ఉద్యోగాల కల్పనకు త్వరలో నోటిఫికేషన్లు ఇచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకుంటామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నిరుద్యోగ సమస్య ను శాశ్వతంగా పరిష్కరించేందకు కృషి చేస్తున్నా మన్నారు. పది, పదిహేను రోజుల్లోనే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు, ఫ్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ నుంచి సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన 135 మందికి ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ కింద రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం సచివాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించా రు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లాడుతూ ద్రౌపది స్వయంవరం సమయంలో అర్జునుడి ల క్ష్యం చేప కన్నుపై కేంద్రీకృతమైనట్లే సివిల్స్‌లో ఎంపిక కావడమనే ఏకైక లక్ష్యం మీకు ఉండాలని, కుటుంబ, ఆర్థిక, ఇతర సమస్యలను పట్టించుకోవద్దని సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన అంశం నిరుద్యోగమేనని, నిరుద్యోగులు, విద్యార్థుల ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందన్నారు.

గత ప్ర భుత్వం తెలంగాణలో విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. వసతి గృహాలను అద్దె భవనాల్లో నిర్వహించారని, వందల మంది విద్యార్థులుంటే ఒకటి, రెండు బాత్రూంలతో సరి పెట్టారని ఆయన మండిపడ్డారు. తాము మాత్రం బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వసతిగృహాలన్నీ ఒకే కాంపౌండ్‌లో ఉండేలా, 20 నుంచి 25 ఎకరాల్లో రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ పేరుతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించామన్నారు. కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్, ఉస్మానియాలో చదువుకున్నామని, వాటిలో చదువుకున్నవారు గర్వంగా చెప్పుకుంటారని, భవిష్యత్‌లో తాము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో చదువుకున్నామని విద్యార్థులు చెప్పుకునేలా వాటిని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మన విద్య సర్టిఫికెట్లకే పరిమితమవుతోందని, వేలాది మంది ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసినా కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు వారిలో ఉండడం లేదని, మరోవైపు కంపెనీలకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారు లభించక సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ
ఈ సమస్య పరిష్కారానికి, నిరుద్యోగ సమస్య నిర్మూలనకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించి, దానికి పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్ర, శ్రీనివాసరాజులను చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా నియమించామని ముఖ్యమంత్రి తెలిపారు. మార్కెట్ అవసరాలకు తగినట్లుగా నిపుణులను తయారు చేసేందుకు వీలుగా ఆ యూనివర్సిటీలో సిలబస్, శిక్షణ, నిర్వహణకు నిధుల సమీకరణ అంతా చైర్మన్, వైస్ చైర్మన్, బోర్డు సభ్యులే చూసుకుంటారని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉంటుందని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీలో అన్ని సర్టిఫికెట్, డిప్లమో కోర్సులు ఉంటాయని, ఈ ఏడాది విద్యా సంవత్సరం వృధా కాకుండా 2 వేల మందికి శిక్షణ ప్రారంభిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి యూనివర్సిటీ శిక్షణ ఇస్తుందన్నారు.

దేశానికి తలమానికంగా స్పోర్ట్ యూనివర్సిటీ
మొన్నటి ఒలింపిక్స్‌లో చిన్న చిన్న దేశాలు పదుల సంఖ్యలో పతకాలు సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం మాత్రం ఆశించిన స్థాయిలో పతకాలు సాధించలేదని, ఇది ఒక రకంగా మనకు అవమానకరమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల దక్షిణ కొరియా పర్యటనలో ఓ స్పోర్ట్ యూనివర్సిటీకి వెళ్లానని, ఆ యూనివర్సిటీలో శిక్షణ పొందిన వారు 19 పతకాలు సాధిస్తే, ఒక క్రీడాకారిణి ఏకంగా మూడు స్వర్ణ పతకాలు సాధించిందన్నారు. రాబోయే ఒలింపిక్స్‌లో మన యువత పెద్ద సంఖ్యలో పతకాలు సాధించేలా యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీకి రూపకల్పన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ యూనివర్సిటీ నుంచి అధిక పతకాల సాధన ద్వారా తెలంగాణ దేశానికే తలమానికంగా నిలవాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

అన్నగా అండగా నిలుస్తా….
విద్యార్థులకు, విద్యా రంగానికి తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నా కొందరు కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వేయించాలని విద్యార్థులతో ఆందోళలతో చేయిస్తున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. పోటీ పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం ఉండదని, కానీ, వాటికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విద్యార్థులను రెచ్చగొట్టి, వారి ప్రాణాలు తీసి రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పదేళ్ల పాటు ఉద్యోగ కల్పనను పట్టించుకోని వారు, తమ ఉద్యోగాలు పోగానే మళ్లీ విద్యార్థులను రెచ్చగొట్టే పనికి పూనుకున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పరీక్షల వాయిదా చేయాలంటూ విద్యార్థులను రెచ్చగొట్టే బావ,బామ్మర్ధి వాళ్లే ఆమరణ దీక్ష చేయాలని సూచించానని హరీశ్, కెటిఆర్‌లకు తెలిపారు. విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్నగా తాను అండగా నిలబడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభయం ఇచ్చారు. కొందరి మాయమాటల ప్రభావంలో పడి నిరసనలు, ధర్నాలకు దిగొద్దని, కొందరి కుట్రలకు పావులుగా మారొద్దని సూచించారు. ప్రభుత్వం ఏం చెబుతోంది, ఏం చేస్తోంది, వాళ్లేం చెబుతున్నారు, ఏం చేస్తున్నారన్న దానిపై సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దృష్టికి ఏ సమస్యలు తీసుకువచ్చినా సానుకూల దృక్ఫథంతో పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

అంతిమంగా సివిల్స్‌కు ఎంపిక కావాలి
ఎస్‌ఐ నియామకాలు చేపడితే సగం మంది ఉమ్మడి నల్గొండ నుంచే ఎంపిక అవుతున్నారని, అందుకు కారణం ముందుగా అక్కడి నుంచి ఎంపికైన వారి స్ఫూర్తేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం సివిల్స్ ప్రిలిమ్స్ పూర్తి చేసిన వారంతా మెయిన్స్‌కు ఆ తర్వాత ఇంటర్వ్యూకు అర్హత సాధించాలని, అంతిమంగా సివిల్స్‌కు ఎంపిక కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధిలో ముందున్నా సివిల్స్ సాధనలో మనకంటే ఎంతో వెనుకబడిన బీహార్, రాజస్థాన్‌లతో పోల్చితే వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి రూ.లక్ష సాయం అందించామని, మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తే మరో రూ.లక్ష అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.లక్ష పెద్ద మొత్తం కాకపోవచ్చని, కానీ, ఈ ప్రభుత్వం మీ వెనుక ఉందన్న ఆత్మవిశ్వాసం కల్పించడానికి భరోసా ఇస్తున్నామని ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రతిష్టను పెంచాలి…
సివిల్స్ ప్రిలిమ్స్ అర్హత సాధించిన వారు, మెయిన్స్, ఇంటర్య్వూలకు ఎంపికయ్యే వరకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తనకు, మంత్రులకు తెలియజేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాటిని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో సివిల్స్‌లో ఎంపికై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. మీ ఎంపికలు మీ కుటుంబానికి, మీ ఊరుకు, మీ జిల్లాకే కాక తెలంగాణకు గర్వకారణమనే విషయం గుర్తుంచుకోవాలని అభ్యర్థులకు సిఎం రేవంత్ సూచించారు. మీరు మా బిడ్డలనే విషయం తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని సచివాలయంలో నిర్వహించామని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో సచివాలయంలోని తనను, సీతక్క వంటి వారినే రానివ్వలేదని, సచివాలయం గడీ కాదని మీరు దూరం నుంచి దీనిని చూసే పరిస్థితి రావద్దని ఆ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

గత ప్రభుత్వం ఫాంహౌస్‌లకు ప్రాధాన్యం
గత ప్రభుత్వం దగ్గర డబ్బులున్నా ఇటువంటి పనులు ఏం చేయలేదని, తమ ప్రభుత్వ ప్రాధాన్యం విద్య, ఉద్యోగాలు, వ్యవసాయం, రైతుసంక్షేమం అయితే గతంలోని వారి ప్రాధాన్యత ఫాంహౌస్‌లు ఇతర కార్యక్రమాలని ముఖ్యమంత్రి విమర్శించారు. అనంతరం మెయిన్స్‌కు అర్హత సాధించిన 135 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెక్కులు అందజేశారు. అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సింగరేణి పరిధి ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, గండ్ర సత్యనారాయణరావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యానారాయణ, ఖమ్మం, పెద్దపల్లి ఎంపిలు రామసహాయం రఘురాంరెడ్డి, గడ్డం వంశీ, సింగరేణి సిఎండి బలరాం , సిఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీపై ఫోకస్ పెట్టాం : భటి
గతంలో ఈ రాష్ట్రాన్ని పాలన చేసిన ఎవరూ కూడా ఆలోచన చేయని విధంగా సిఎం రేవంత్ ఆధ్వర్యంలో మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసిందే ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం నుంచి సివిల్స్, టిజిపిఎస్సీ పరీక్షలు రాస్తూ రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడేలా ఆర్థిక సాయాన్ని అందించాలని మొట్ట మొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక్కో విద్యార్థికి రూ. లక్ష రూపాయలు ఈ పరీక్షకు తయారు అవుతున్న వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇది పెద్ద నగదు కాకపోయినప్పటికీ ఈ సాయం ద్వారా కొంత ఉపశమనం కలిగించేదన్నారు. విద్యా వ్యాప్తి కోసం దీన్ని సింగరేణి ఆర్థిక సాయం చేసిందన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ దేశ చరిత్రలో ఎవరూ కూడా ఆలోచన చేసి ఉండరని,

పెద్ద ఎత్తున ఈ స్కూల్స్ మొట్ట మొదటి సారి మొదటి సంవత్సరంలోనే రూ. 5 వేల కోట్లతో నిధులు ఖర్చుపెట్టబోతుందన్నారు. రాష్ట్రంలో గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్, ఇన్ఫ్రాస్టక్షర్ కోసం సంవత్సరానికి రూ.3 కోట్లు ఖర్చుపెట్టేదని, కానీ, ఈ సంవత్సరం తాము రూ. 5 వేల కోట్లకు పెంచామని ఇది తమ ప్రాధాన్యత అని ఆయన చెప్పుకొచ్చారు. విద్య కోసం అంగన్‌వాడీ దగ్గర నుంచి మొదలు కొని ప్రణాళికలు తయారు చేశామని ఆయన వెల్లడించారు. హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీపై ఫోకస్ పెట్టామన్నారు. మరోవైపు నేడు రాష్ట్రానికి 4వ సిటీ రాబోతుందని, ఆ ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసినట్లు ఆయన తెలిపారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఇండస్ట్రీలకు అనుగుణంగా సిలబస్‌ను తయారు చేసేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. స్కిల్ వర్సిటీలో చదివిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. దాదాపు రాష్ట్రంలోని 63 ఐటీఐలు కళాశాలలు మూసివేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఆ ఐటీఐలను అడ్వాన్స్ స్కిల్ సెంటర్‌లుగా భవిష్యత్‌లో అప్‌గ్రేడ్ చేస్తామని ఆయన తెలిపారు.

మెయిన్స్‌తో పాటు ఇంటర్వ్యూలోనూ విజయం సాధించాలి: మంత్రి పొన్నం
సివిల్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచనలు చేశారు. రాజీవ్ గాంధీ అభయహస్తం పేరిట సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయి మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మెయిన్స్‌తో పాటు ఇంటర్వ్యూలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. స్కూల్లో నర్సరీ నుంచి చదివే ప్రతి విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం ఉండాలన్నదే సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన అని అన్నారు. రాష్ట్రం నుంచి సివిల్స్ మెయిన్స్‌కు 135 మంది ఎంపిక కావడం అభినందించదగ్గ విషయం అన్నారు. వీరంతా సక్సెస్ కావాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థులు కేవలం వారి తల్లిదండ్రులనే కాదని, మొత్తం తెలంగాణ గర్వించేలా చేయాలని ఆయన సూచించారు. ఒక్క నిమిషం కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రిపేర్ కావాలని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News