Tuesday, September 17, 2024

అల్లర్లకు 54 మంది బలి..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లో గత రెండు రోజులుగా చెలరేగిన మారణ హోమంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 54కు చేరింది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అంటున్నారు. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చెలరేగిన ఘర్షణలతో పరిస్థితి అదుపు తప్పడంతో సైన్యాన్ని రంగంలోకి దించడం, కీలక ప్రాంతాల్లో అసోం రైఫిల్స్ బలగాలు మోహరించడంతో పరిస్థితి క్రమంగా కుదుట పడుతోంది. ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ శనివారం నాడు ఇంఫాల్ వ్యాలీలో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. ఇంఫాల్ పట్టణంలో ప్రధాన ఏరియాలు, రోడ్లపై గణనీయంగా ఆర్మీ బలగాలు, ఆర్‌పిఎఫ్,సెంట్రల్ పోలీసు ఫోర్స్ మోహరించడంతో మార్కెట్లు క్రమంగా తెరుచుకున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు కూడా మొదలయ్యాయి. భద్రతా బలగాల పహరా మధ్య ప్రజలు ఉదయమే రోడ్లపైకి వచ్చి కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు.

Also Read: ఐదుగురు మిలిటెంట్లు హతం

కాగా మణిపూర్ మారణకాండలో మృతి చెందిన 54 మందిలో 16 మృతదేహాలను చురాచాంద్‌పూర్ జిల్లా ఆస్పత్రిలో ఉంచారు. మరో 15 శవాలను తూర్పు ఇంఫాల్ జిల్లాలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో భద్రపరిచారు. మరో 23 మృతదేహాలను లాంఫెల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఉంచారు. గత 12 గంటల్లో ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో గృహదహనాలు, దిగ్బంధాలు వంటి చెదురుమదురు ఘటనలు జరిగినా పరిస్థితి అదుపులోనే ఉందని రక్షణ అధికారులు చెప్పారు. అయితే ఆ ఘటనల వివరాలను వారు వెల్లడించలేదు. గిరిజన, గిజనేతరుల మధ్య చోటు చేసుకున్నట్లుగా చెబుతున్న ఈ ఘర్షణల్లో 100 మందికి పైగా గాయపడినట్లు అనధికార వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు మాత్రం ఈ ఘటనలను ధ్రువీకరించడం లేదు. సుమారు 13,000 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News