Saturday, September 28, 2024

ఆరేళ్ల బాలికపై పిఇటి లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

 నిందితుడిపై పోక్సో కేసు
 పోలీసులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల మధ్య వాగ్వాదం
 పోలీసులపైకి రాళ్లు విసిరిన ఆందోళకారులు
 సిఐ, ఇద్దరు ఎస్‌ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు
 విచారణ జరిపిస్తామని జెసి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌పి సింధూశర్మ హామీతో ఆందోళన విరమణ
మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని జీవధాన్ పాఠశాలలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల చిన్నారిపై అదే పాఠశాలకు చెందిన పిఇటి నాగరాజు లైంగిక దాడి చేశాడు. పాఠశాలలో సోమవారం జరిగిన ఈ ఘటనతో పట్టణ పోలీసులు పిఇటిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికపై పిఇటి లైంగిక దాడి చేశాడన్న విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల యాజమాన్యంతో గొడవకు దిగారు. ఈ ఘటనపై నిర్లక్షం వహించిన పిఇటి, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం ఆనోటా ఈనోటా వ్యాపించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వీరి రాకతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు పాఠశాలకు చేరుకొని ఆందోళనలో పాల్గొన్నారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కొందరు తరగతి గదుల్లో ఉన్న పిల్లలను బయటకు పంపడానికి ప్రయత్నించగా విద్యార్థులు భయంతో వణికిపోయారు. పట్టణ సిఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆందోళనకారులను సముదాయించినా వినకపోవడంతో కాసేపటికి డిఎస్‌పి నాగేశ్వర్‌రావు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు పాఠశాలకు చేరుకున్నారు. అడిషనల్ ఎస్‌పి నర్సింహారెడ్డి పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పాఠశాలలో ఉద్రిక్తతల నేపథ్యంలో విద్యార్థులను బయటకు పంపించారు. దాంతో వారు కూడా ఆందోళనలో భాగస్వామ్యం అయ్యారు. ‘వి వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ రూంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసరడంతో పట్టణ సిఐ చంద్రశేఖర్‌రెడ్డి తలకు గాయమైంది. ఎస్‌ఐ రాజు, లింగంపేట్ ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కాగా, పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు మళ్లీ పాఠశాలలో ఆందోళనకు దిగారు. ఆందోళన నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌పి సింధూశర్మ పాఠశాలకు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుం చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యాచారయత్నానికి పాల్పడిన పిఇటిపై నాన్ బెయిలబుల్ కేసు నమో దు చేయాలని, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చే శారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్షం, ఇతర ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌పి సింధూశర్మ హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన విరమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News