లక్నో: మేనత్త కూతురుపై అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి అల్లుళ్లు హత్య చేశారు. ఆమె మెడకు తాడు బిగించి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా దృశ్యాన్ని సృష్టించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీ ప్రాంతం ఫరీదాపూర్లో జరిగింది. పోలీసులకు తెలిస్తే కేసులు అవుతాయని, ఎవరికి తెలియకుండా యువతి మృతదేహాన్ని దహనం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అమ్మాయి తల్లిదండ్రులు కూలీ పనుల నిమిత్తం వారణాసిలో ఉండడంతో తన కూతురు(17), కుమారుడిని మేనమామ ఇంట్లో ఉంచారు. దీంతో మేనమామ కుమారులిద్దరు ఆమె గదిలోకి వెళ్లి.. యువతిపై అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి చంపేసిన అనంతరం ఉరేశారు. అనంతరం ఆమె ఆత్మహత్య చేసుకుందని గ్రామస్థులను నమ్మించారు. వెంటనే అదే కులానికి చెందిన పెద్దలు పోలీసులకు, యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా యువతి మృతదేహానికి దహన సంస్కారాలు చేపట్టారు. యువతి తల్లిదండ్రులు వచ్చి నిలదీయడంతో ఆత్మహత్య చేసుకుందని సమాధానమిచ్చారు. అక్క రూమ్లో నుంచి మేనమామ కుమారులు వచ్చారని యువతి తమ్ముడు తన తల్లిదండ్రులకు తెలిపాడు. సదరు కుటుంబంపై అనుమానం రావడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పది మందిని అదుపులోకి తీసుకొని విచారించారు. యువతి మేనమామ ఇద్దరు కుమారులపై అత్యాచారం, మర్డర్ కేసు నమోదు పోలీసులు చేసి అదుపులోకి తీసుకున్నారు.