గాంధీనగర్: మోతెరా స్టేడియంలో కొత్త చరిత్ర ఆరంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం ఇరుదేశాల జాతీయగీతాల ఆలాపనతో ప్రారంభమైంది.ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ‘భారత్ మాతకీ జై.. నమస్తే ట్రంప్’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ”అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ట్రంప్ కు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. నమస్తే అనే పదం భారతీయ మూలాలకు, సంస్కృత భాషకు చెందిన పదం. ఆ పదంతో మనిషిని గౌరవించడమే కాదు.. ఆ మనిషిలోని ఔనత్యాన్ని కూడా చూస్తాం. ఐదు నెలల క్రితం హ్యూస్టన్ లో హౌడీ మోడీ కార్యక్రమంలో పాల్గొన్నాను.. ఇప్పుడు నా స్నేహితుడు ట్రంప్ ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో భాగంగా ఇండియా వచ్చారు. భారత్, అమెరికా స్నేహంపై ఎలాంటి అపోహలు వద్దు. భారత్-అమెరికా స్నేహం చిరకాలం వర్దిల్లాలి. భారత్-అమెరికా మైత్రి బంధంతో ఇకపై సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. భారత్-అమెరికా బంధం కేవలం ఓ భాగస్వామ్యమే కాదని.. ఇది మరింత సన్నితమైన స్నేహంగా మారింది.” అని మోడీ పేర్కన్నారు.
కాగా, ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమం సందర్భంగా మోతెరా స్టేడియానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. దాదాపు లక్షకుపైగా వచ్చిన ప్రజలతో మోతెరా స్టేడియం కిక్కిరిసిపోయింది.
PM Narendra Modi Addresses in Motera Stadium