కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ప్రయాణాలకు దూరంగా ఉండాలి
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా(కొవిడ్19) నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకచర్యలు తీసుకుంటుందని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావు ట్విట్టర్లో పోస్టుచేశారు. అత్యవసరచికిత్స చేసేందుకు అన్నిరకాల సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలకు ఎలాంటి సందేహం ఉన్నా, వ్యాధి అనుమానిత లక్షణాలున్నా తక్షణం 104కు కాల్చేయాలని కెటిఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే సోషల్మీడియాలో వస్తున్న అసత్యకథనాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం కరోనాను నియంత్రణకోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు తమవంతు జాగ్రతలను తప్పనిసరిగా పాటించాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
ప్రధానంగా ప్రతి ఒక్కరు దూరం పాటించాలని చెప్పారు. గుమికూడకుండా దూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని తెలిపారు. తీవ్రమైన దగ్గు, జలుబు ఉంటే డాక్టర్లను వెంటనే సంప్రదించాలని కోరారు. ప్రధానంగా ప్రయాణాలకు దూరంగా ఉండాలని కెటిఆర్ పేర్కొన్నారు. కరోన నియంత్రణకోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు తోడుగా ఉండి వైద్యసలహాలను పాటించి కరోనాను తరిమివేయాలని చెప్పారు.