వాషింగ్టన్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా వివిధ దేశాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. భారత్ సహా 64 దేశాలకు 174 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్కు 2.9 మిలియన్ డాలర్లు కేటాయించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన వంద మిలియన్ డాలర్ల ప్యాకేజికి ఇది అదనం. అమెరికా ప్రజలపై కరోనా మహమ్మారి చూపుతున్న ప్రతికూల ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం పలు ఉద్దీపన చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కరోనా వల్ల అత్యధిక స్థాయిలో ప్రభావితం అయిన 64 దేశాలకు కూడా సహాయాన్ని ప్రకటించింది.
భారత్కు ప్రకటించిన నిధులతో లేబరేటరీ వ్యవస్థలు, కరోనా సోకిన వ్యక్తుల గుర్తింపు, బాధితులపై నిరంతర పర్యవేక్షణ, ఇతర సాంకేతిక సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించింది. మన పొరుగు దేశాలైన శ్రీలంకకు 1.3 మిలియన్ డాలర్లు, నేపాల్కు 1.8 మిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్కు 3.4 మిలియన్ డాలర్లు, అఫ్ఘానిస్థాన్కు 5 మిలియన్ డాలర్లు కేటాయించారు. అలాగే అవసరమైన దేశాలకు భారీ సంఖ్యలో వెంటిలేటర్లు సరఫరా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వీటితో పాటుగా ఇతర వైద్య పరికరాల ఉత్పత్తిని అమెరికా భారీ ఎత్తున పెంచిందని ఆయన తెలిపారు.అమెరికా అవసరాలకే కాక ఇతర దేశాలకు కూడా వీటిని అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కరోనా వైరస్ సోకిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో తాను మాట్లాడానని ట్రంప్ తెలిపారు. జాన్సన్ అడిగిన మొట్టమొదటి సాయం వెంటిలేటర్లేనని ఆయన చెప్పారు.