హైదరాబాద్ ః దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే మోదీ జిమ్మిక్కులు చేస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ప్రధానిపై ఓవైసీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. . ‘ఈ దేశం ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కాదు. భారతదేశ ప్రజలందరూ మనుషులే, వారికి ఆశలు, ఆశయాలు ఉంటాయి. తొమ్మిది నిమిషాల గిమ్మిక్కులతో జీవితాలను దిగజార్చవద్దు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏం లభిస్తోంది? పేదవాళ్లకు ఎలాంటి ఊరట దక్కుతోంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. చేయాల్సింది చేయకుండా మళ్లీ ఓ కొత్త డ్రామాకు తెరలేపారు’ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. సాయమడిగితే.. దీపాలు ఆర్పమంటున్నారు.. ప్రణాళిక లేని లాక్డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వలస కార్మికులు తమ ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని సిఎంలు కోరుతుంటే దీపాలు ఆపేయమనడం ఎంతవరకూ సబబని అసద్ ప్రశ్నించారు.