అసంబద్ధమని చైనా ఖండన
బీజింగ్ : కరోనా వ్యాప్తి సమాచారం చైనా దాచిపెట్టిందని, హెచ్చరించిన నిఘా వర్గాలను అరెస్టు చేసిందని ఆరోపిస్తూ అమెరికాలో దాఖలైన వ్యాజ్యాన్ని చైనా బుధవారం కొట్టి పారేసింది. ఇది అసంబధ్ధం తప్ప ఇంకేమీ కాదని వ్యాఖ్యానించింది. మిస్సోరి లోని తూర్పు డిస్ట్రిక్టు కోర్టులో ఆ రాష్ట్ర అటార్నీ జనరల్ ఎరిక్ స్కిమిట్ ఈ దావా వేశారు. చైనా వైఖరి వల్ల మానవ సమాజానికి తీరని నష్టం జరిగిందని, ఆర్థికంగా ప్రపంచ దేశాలు దెబ్బతిన్నాయని వ్యాజ్యంలో ఆరోపించారు. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన ఈ వ్యాజ్యంలో చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ , చైనా అధికార యంత్రాంగం, సంస్థలను కూడా చేర్చారు.
వైరస్ తొలిదశలో నివారించే అవకాశం ఉన్నప్పటికీ చైనా నిర్లక్షంగా వ్యవహరించిందని, వైరస్పై జరిగిన పరిశోధనల్లోని కీలక సమాచారాన్ని ధ్వంసం చేసిందని, ఒకరి నుంచి మరొకరికి ఈ మహమ్మారి వ్యాపిస్తున్నట్టు డిసెంబరు లోనే స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ ఈ వాస్తవాలను నిరాకరించిందని, పెర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పిపిఇ) కిట్లను కూడా దాచిపెట్టిందని, ప్రపంచ వ్యాప్తంగా వైరస్ విస్తరించేలా చేసిందని వ్యాజ్యంలో ఆరోపించారు ప్రజా జీవితాన్ని విపత్కర పరిస్థితుల్లోకి నెట్టడం, ప్రమాదకర పనులకు పాల్పడడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి నేరాల కింద విచారణ జరపాలని కోరారు. ఈ వ్యాజ్యంపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షుయాంగ్ స్పందిస్తూ ఈ ఆరోపణలకు ఎలాంటి వాస్తవ మైన చట్టబద్ధమైన ఆధారం లేదని వ్యాఖ్యానించారు.