మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు ఉపయోగపడేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం అందించారు. తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్పిడిసిఎల్, ఎన్పిడిసిఎల్కు చెందిన ఉద్యోగులు, పెన్షనర్లు (అంతా కలిసి 70వేల మంది) తమ ఒక రోజు వేతనం మొత్తం రూ.11.40 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును నాలుగు సంస్థలకు చెందిన సిఎండిలు, వివిధ విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్కు అందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, ఎన్పిడిసిఎల్. సిఎండి గోపాలరావు, ట్రాన్స్ కో జెఎండి శ్రీనివాసరావు, డైరెక్టర్ సూర్యప్రకాశ్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు శివాజి, రత్నాకర్ రావు, అంజయ్య, బిసి రెడ్డి, సాయిబాబా, ప్రకాశ్, జాన్సన్, రమేశ్, వజీర్, కుమారస్వామి, సాయిలు, గణేష్, సతన్యనారాయణ, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్ట కాలంలో విద్యుత్ ఉద్యోగులంతా రేయింబవళ్ళు కష్టపడి 24 గంటల పాటు విద్యుత్ అందిస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యోగులంతా తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించడం ప్రభుత్వానికి స్పూర్తిగా నిలుస్తుందన్నారు.