కరోనా లాక్ డౌన్ పుణ్యమా అంటూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఓటీటీలకు బాగా డిమాండ్ పెరిగింది. ఈ సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా పుంజుకొని సబ్స్ర్కైబర్స్ పెంచుకుంటూ పోతున్నాయి. ఇంటికే పరిమితమైన జనాలు ఓటీటీలలో వచ్చే ఒరిజినల్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే బాలీవుడ్లో పలువురు స్టార్లు ఈ వెబ్ సిరీస్లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సైఫ్ అలీఖాన్, రాజ్ కుమార్ రావు, మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, కియారా అద్వానీ, రాధికా ఆప్టే, మనీషా కొయిరాలా, భూమి పెడ్నేకర్ లాంటి వారు వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. మన టాలీవుడ్లో కూడా శ్రీకాంత్, సందీప్ కిషన్, నవదీప్, మంచు లక్ష్మీ, హెబ్బా పటేల్ లాంటి వారు ఇప్పటికే వెబ్ సిరీస్లలో దర్శనమిచ్చారు. కాకపోతే ప్రస్తుతానికి తెలుగులో వెబ్ సిరీస్లు అన్నీ స్టార్స్ లేకుండా చిన్నవాళ్లతోనే తీస్తున్నారు. ఈ మధ్య స్టార్ హీరోయిన్లు సమంత, ప్రియమణి కూడా ఆ వైపుగా అడుగులు వేశారు.
తెలుగు వెబ్ సిరీస్లలో మాత్రం స్టార్ హీరోలు నటించడం లేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్తో వెబ్ సిరీస్ తీయాలని ప్లాన్ చేస్తున్నారట. సురేష్ బాబు ఇప్పటికే ఆ విధంగా ఆలోచనలు చేస్తున్నారట. ఫ్యామిలీస్ కూడా వెబ్ సిరీస్లు చూస్తుండటంతో తెలుగు వెబ్ సిరీస్లలో సంచలనం అయ్యేలా వెంకటేష్తో ఒక సిరీస్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. దీనిపై డైరెక్టర్ తేజతో చర్చించడం కూడా జరిగిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం తెలుగు సినిమా ఓటిటీ రంగంలో ఈ వెబ్ సిరీస్ హవా చూపించడం ఖాయమని చెప్పవచ్చు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా వెబ్ సిరీస్లో నటించబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.