హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నగరంతో పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, సోమాజీగూడ, సనత్నగర్, నాంపల్లి, అబిడ్స్, కోఠిల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జార్ఖండ్ దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీల నుంచి 7.6 కి.మీల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.