ప్రగతిభవన్లో జాతీయపతాకాన్ని
ఆవిష్కరించిన సిఎం కెసిఆర్
కొవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆహ్వానితులు
అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళి
జిల్లాల్లో పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రులు, ఇన్చార్జీలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 74వ స్వాతంత్రదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రగతిభవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ పతకాన్ని ఎగరవేసి స్వాతంత్య్ర సమరయోధులను, వారి త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాజ్యసభ పక్షనాయకుడు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, డిజిపి మహేందర్ రెడ్డి తదిచరలు పాల్గొన్నారు. గోల్కోండ కోటపై జెండా ఎగరవేయాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో రద్దు చేశారు. పరిమితమైన ఆహ్వానితులతో కలిసి సిఎం కెసిఆర్ జాతీయ పతాకాన్ని ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. జెండా ఎగరవేసేముందు సిఎం కెసిఆర్ శాసనసభ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. శాసన సభ కార్యాలయం ఆవరణలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి జెండాను ఎగరవేశారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర ప్రజలకు 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సిరిసిల్లా జిల్లా కేంద్రంలో రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పిపిఇ కిట్లు పంపిణీ చేశారు. అలాగే 40 గ్రామాలకు బాడీ ఫ్రీజర్లు అందజేశారు. మధుమేహంతో బాధపడతూ కరోనా సోకిన 80 ఏండ్ల మహిళా కోలుకోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని కెటిఆర్ అభినందించారు. రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి హరీష్రావు సిద్దిపేట పట్టణంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో జిల్లాప్రజాపరిషత్ అధ్యక్షురాలు వేలేటి రోజా రాధాకృష్ణ, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, శాసనమండలి సభ్యులు ఫారుక్ హుస్సేన్, రఘోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ రిజర్వాయర్ల జిల్లాగా సిద్దిపేట అవతరించిందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాకలెక్టర్ కార్యాలయంలో మంత్రి మహమూద్ అలీ జెండా ఎగరవేశారు. వరంగల్ కలెక్టరేట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జెండా ఎగరవేశారు. ఎర్రబెల్లితో పాటుగా ఎంపిలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, శాసనసభ్యుడు అరూరి రమేష్ , చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీష్రెడ్డి జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ జెండా ఎగరవేశారు. ఆదిలాబాద్లో ప్రభుత్వ విప్, ఎంఎల్సి కర్నె ప్రభాకర్ జాతీయపతాకాన్ని ఎగరవేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎంఎల్ఏ జోగురామన్న పాల్గొన్నారు. అనంతరం కర్నె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రావిర్భావం అనంతరం సాధించిన ప్రగతి, సాధించనున్న కార్యక్రమాలను వివరించారు. మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లాకలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ జాతీయపతాకాన్ని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి మాలోతు కవిత పాల్గొన్నారు. జిల్లాలవారిగా ఇన్ఛార్జీలు జాతీయపతాకాలను ఎగరవేయగా నియోజ కవర్గాల వారిగా శాసన సభ్యులు జాతీయపతాకాలను ఎగరవేస్తూ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
CM KCR Flag Hoisting at Pragathi Bhavan