హైదరాబాద్: భారత్లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. గత నెల రోజుల నుంచి కరోనా వైరస్ తో రోజుకు 1000పైగా మంది మరణిస్తున్నారు. ముంబయిలాంటి మహానగరాల్లో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. కరోనా వైరస్ కు ముంబయి, ఢిల్లీ, చెన్నై, థానే, పూనే, హైదరాబాద్, బెంగళూరు, కోల్ కతా, లక్నో వంటి నగరాలు గజ గజ వణికిపోతున్నాయి. నగరాలలోనే సగానికి పైగా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో గత 24 గంటల్లో 70,589 కేసులు నమోదుకాగా 779 మంది మృత్యువాతపడ్డారు. భారత్ లో ఇప్పటి వరకు 61 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 96,318 మంది చనిపోయారు. కరోనా నుంచి 51.01 లక్షల మంది కోలుకోగా 9.43 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 11.42 లక్షల మంది టెస్టుల చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 7.31 కోట్లకు చేరుకుంది. కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్యలో భారత్ మూడో స్థానంలో ఉండగా అమెరికా తొలి స్థానం, బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. మూడు దేశాల్లోనే చనిపోయిన వారిలో 45 శాతం మంది ఉన్నారు. ప్రపంచం వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో పది లక్షల మంది మరణించారు.