63 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 86,821 కేసులు, 1,181మరణాలు, కోలుకున్న 85,736 మంది
వరసగా 12వ రోజు పది లక్షల లోపే యాక్టివ్ కేసులు
కాంగ్రెస్ నేత అహ్మద్పటేల్కు పాజిటివ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 86,821కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఈ వ్యాధిబారిన పడిన వారి సంఖ్య 63,12,584కు చేరుకుంది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 98,678 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం తాజాగా మరో 1,181 మంది వైరస్తో పోరాడుతూ మృత్యువాతపడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 52,73,201 మంది కోలుకుని డిశ్చార్జి కాగా 9,40,705 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,736 మంది కోలుకున్నారు. కరోనా రోగుల రికవరీ రేటు 83.53 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.56 శాతంగా ఉంది. కాగా యాక్టివ్ కేసులు పదిలక్షలకన్నా తక్కువగా ఉండడం వరసగా ఇది 12వ రోజు కావడం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7,56,19,781కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్యపరిశోధనా మండలి( ఐసిఎంఆర్) తెలిపింది. గడచిన 24 గంటల్లో 14,23,052 శాంపిల్స్ను పరీక్షించినట్లు తెలిపింది.
అహ్మద్ పటేల్కు పాజిటివ్
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. దీంతో ఆయన ఢిల్లీలోని తన నివాసంలో ఐసొలేషన్లోకి వెళ్లారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కొవిడ్ పరీక్షలు చేయించుకుని ఐసొలేషన్లోకి వెళ్లాలని ఆయన ట్విట్టర్ద్వారా సూచించారు.
India’s Corona Cases Crosses 63 Lakh Mark