ఆస్తి పన్ను చెల్లించిన రజనీకాంత్
చెన్నై: అగ్రనటుడు రజనీకాంత్ తన కళ్యాణ మండపానికి జరిమానాతోసహా రూ. 6.56 లక్షల ఆస్తి పన్నును గురువారం చెల్లించారు. స్థానిక కోడంబ్కాకంలో ఉన్న రాఘవేంద్ర కళ్యాణ మండపానికి రూ. 6.56 లక్షల ఆస్తి పన్నును రజనీకాంత్ చెల్లించారని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తెలిపింది. 2020-21 తొలి ఆర్ధ సంవత్సరానికి రూ. 9,386 లేట్ ఫీ పెనాల్టీతో సహా రూ. 6.56 లక్షల ఆస్తిపన్నును రజనీకాంత్ చెక్కు రూపంలో చెల్లించినట్లు జిఎంసి తెలిపింది. కాగా, ఆస్తి పన్ను విషయమై ముందుగా జిఎంసికి అప్పీలు చేసుకుని ఉండాల్సిందని, హడావుడిగా కోర్టుకు వెళ్లి తప్పు చేశామని రజనీకాంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
అనుభవం ఒక గుణపాఠం అంటూ ఆయన పరోక్షంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. కొవిడ్-19 లాక్డౌన్ వల్ల తన కళ్యాణ మండపం గత ఆరునెలలుగా మూసివేతలో ఉందని, ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జిఎంసికి నోటీసు ఇచ్చిన వెంటనే మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసిన రజనీకాంత్ను కోర్టు బుధవారం తీవ్రంగా మందలించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ అనితా సుమంత్ కొట్టివేస్తూ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Rajinikanth Pays Full Property Tax