తిరువనంతపురం: వాయనాడ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ అనుమానిత మావోయిస్ట్ మృతి చెందిన ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వివరణ ఇచ్చారు. ఆత్మరక్షణలో భాగంగా థండర్బోల్ట్ ప్రత్యేక పోలీస్ దళం జరిపిన కాల్పుల్లో వేలుమురుగన్(33) మరణించారని విజయన్ తెలిపారు. తమ ప్రభుత్వానికి ఎవరినీ చంపే ఉద్దేశం లేదని విజయన్ అన్నారు. వేలుమురుగన్పై పలు కేసులున్నాయని, 17 ఏళ్ల వయసులోనే ఒడిషాలోని ఓ పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలు ఎత్తుకెళ్లిన ఘటనలో మురుగన్ నిందితుడని విజయన్ తెలిపారు. మంగళవారం వాయనాడ్ అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో తమిళనాడుకు చెందిన వేలుమురుగన్ చనిపోయిన ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు సిపిఐ డిమాండ్ చేసింది. కేరళలోని వామపక్ష ప్రభుత్వంలో సిపిఐ భాగస్వామ్య పక్షమన్నది తెలిసిందే. మావోయిస్టుల చర్యలను తాము సమర్థించమని, అయితే ఆ పేరుతో వారిని ప్రభుత్వం కాల్చి చంపడాన్ని కూడా అనుమతించమని సిపిఐ పేర్కొన్నది.
Police Fired In Self-Defence Says Kerala Chief Minister