హైదరాబాద్: ప్రముఖ కవి దేవీప్రియ(షేక్ ఖ్వాజా హుస్సేన్) మృతి పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం తెలిపారు. కవి, రచయిత, కార్టూనిస్టుగా సామాజిక చైతన్యానికి కృషి చేశారని కెసిఆర్ పేర్కొన్నారు. దేవీప్రియ సాహిత్య ప్రతిభకు ‘గాలిరంగు’ రచన మచ్చుతునక అని సిఎం తెలిపారు. దేవీప్రియ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దేవీప్రియ నవంబర్ 6వ తేదీన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేరారు. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. దేవీప్రియ పేరుతో ఆయన రచనలు చేసి అదే పేరుతో ప్రజలకు సుపరిచితుడయ్యారు. 1949 ఆగస్టు 15న గుంటూరులో ఆయన జన్మించారు. గత 50ఏళ్లుగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ప్రజాతంత్ర, హైదరాబాద్ మిర్రర్ వంటి పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. ఉదయం, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రన్నింగ్ కామెంటరీ పేరుతో దేవీప్రియ కవితలు రాశారు. అమ్మచెట్టు, గరీబు గీతాలు, నీటిపుట్ట, అరణ్య పురాణం తదితర 12 పుస్తకాలు రచించారు. మా భూమి, రంగుల కల, దాసి తదితర సినిమాలకు పాటలు రాశారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు.