ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఎగుమతికి ఓకే
కేంద్రమంత్రివర్గం నిర్ణయాలు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గం బుధవారం పలు నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఎగుమతికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం, కర్ణాటక తూముకూరులో పారిశ్రామిక కారిడార్లతో పాటు గ్రేటర్ నోయిడాలోని మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్, మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ లకు కేంద్రం అనుమతి తెలిపింది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు వెల్లడించారు. మూడు పారిశ్రామిక కారిడార్లకు కలిపి కేంద్ర ప్రభుత్వం రూ. 7,725 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక కారిడార్లను నిర్మించడం ద్వారా 2.8 లక్షల మందికి ఉపాది లభించనున్నట్లు అంచనా వేసినట్లుగా పేర్కొన్నారు. కాగా కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదిత వ్యయం రూ.2,139 కోట్లుగా ఉందని తెలిపారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల పెద్దఎత్తున ఉపాధి అవకాశాల కల్పనతో పాటు, తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ వల్ల లాజిస్టిక్ ఖర్చు తగ్గింపుతో పాటు, నిర్వహణ సామర్థ్యం మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వీటితో పాటు భారత్, భూటాన్ దేశాల మధ్య శాంతి భద్రతలకు సంబంధించి ఎంఓయుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.