ఏడాదిలో టోల్ప్లాజాలు తొలగిస్తాం
జిపిఎస్ విధానం ద్వారా టోల్ వసూలు చేస్తాం
లోక్సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన
న్యూఢిల్లీ: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ప్లాజాలను తొలగిస్తామని కేంద్ర రవాణా మంత్రి నితన్ గడ్కరీ తెలిపారు. దీని స్థానంలో జిపిఎస్ ఆధారిత టోల్ వసూళ్లను తీసుకు వస్తామని గురువారం లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. ‘ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ప్లాజాలను తొలగిసామని సభా వేదికగా హామీ ఇస్తున్నాను. అంటే ఇకపై జిపిఎస్ ఆధారంగా టోల్ వసూళ్లు చేపట్టనున్నాం. వాహనానికి ఉన్న జిపిఎస్ వ్యవస్థ ఆధారంగా వాహనదారుల బ్యాంక్ ఖాతాలనుంచి నేరుగా టోల్ మొత్తాన్ని మినహాయించుకునే కొత్త వ్యవస్థను తీసుకువస్తాం’ అని గడ్కరీ వివరించారు. ఇక దేశవ్యాప్తంగా 93 శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే టోల్ చెల్లిస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే మిగతా 7 శాతం మంది మాత్రం రెట్టింపు టోల్ కడుతున్నా ఫాస్ట్టాగ్ను ఉపయోగించడం లేదని తెలిపారు. ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించని వాహనదారులపై పోలీసుల దర్యాప్తునకు ఆదేశించినట్లు గడ్కరీ తెలిపారు. టోల్ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు 2016లో ప్రభుత్వం ఫాస్టాగ్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 16నుంచి అన్ని జాతీయ రహదారులపై ఫాస్టాగ్ను తప్పనిసరి చేశారు. ఫాస్టాగ్ లేని వారినుంచి రెట్టింపు టోల్ వసూలు చేస్తున్నారు.
All toll plazas to be removed in one year: Nitin Gadkari