సుప్రీంకోర్టులో పిల్
న్యూఢిల్లీ: బ్యాలట్ పత్రాలు, ఇవిఎంలలో ఎన్నికల చిహ్నానికి బదులుగా అభ్యర్థుల పేర్లు, వయసు, విద్యార్హతలు, ఫోటో పొందుపరచాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తమ అభిప్రాయం చెప్పాలనిఅటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ను సుప్రీంకోర్టు శుక్రవారం కోరింది. ఈ పిల్పై కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు లాంఛనంగా ఎటువంటి నోటీసులు జారీచేని చీఫ్ జస్టిస్ ఎస్ఎ బాబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తన పిటిషన్ను అటార్జీ జనరల్ కెకె వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలకు అందచేయాలని పిటిషనర్, సీనియర్ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయను కోరింది.
ముందుగా ఈ పిటిషన్ ప్రతిని ఎజి, ఎస్జిలకు అందచేయండని, ఈ దశలో తాము ఎటువంటి నోటీసు జారీచేయడం లేదని ధర్మాసనం పిటిషనర్కు తెలిపింది. అంతకుముందు బిజెపి నాయకుడు, పిటిషనర్ ఉపాధ్యాయ తరఫున మరో సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ధర్మాసనం ఎదుట తన వాదనలు క్లుప్తంగా వినిపించారు. ఇవిఎంలపై ఎన్నికల చిహ్నం ఉండడంపై మీ అభ్యంతరాలు ఏమిటని ధర్మాసనం పిటిషనర్ను ప్రశ్నించింది. దీనికి న్యాయవాది సమాధానమిస్తూ అభ్యర్థి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. బ్రెజిల్లో అభ్యర్థులకు సంఖ్యలు ఉంటాయే తప్ప ఎన్నికల చిహ్నాలు ఉండవన్న విషయాన్ని కూడా ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. తదుపరి విచారణలో తన వాదనలు పూర్తి స్థాయిలో వినిపిస్తానని ఆయన తెలిపారు.