టోక్యో: ఒలింపిక్స్లో పతకం ఆశలు రేపిన భారత డిస్కస్త్రో క్రీడాకారిణి కమల్ప్రీత్ కౌర్ నిరాశ పరిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో కమల్ప్రీత్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన కమల్ప్రీత్ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది. దీంతో డిస్కస్త్రోలో పతకం లభించడం ఖాయమని భావించిన భారత అభిమానులకు నిరాశే మిగిలింది. క్వాలిఫికేషన్ రౌండ్ విభాగంలో రెండో స్థానంలో నిలువడం ద్వారా కమల్ప్రీత్ పతకం ఆశలు రేకెత్తించింది. అదే జోరును ఫైనల్లోనూ కొనసాగిస్తే భారత్కు పతకం ఖాయమని అందరూ భావించారు. కానీ కీలకమైన ఫైనల్లో కమల్ప్రీత్ ఘోరంగా విఫలమైంది. 12 మంది పోటీ పడిన ఫైనల్లో ఆరో స్థానంలో నిలిచి పతకం ఆశలను నీరుగార్చింది. ఇక ఫైనల్లో 64 మీటర్ల దూరాన్ని కూడా కమల్ప్రీత్ అందుకోలేక పోయింది. ఇక అమెరికా అథ్లెట్ అల్మన్ వాలరీ తొలి ప్రయత్నంలోనే 68.98 మీటర్లు త్రో చేసి ముందే స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. ఇతర అథ్లెట్లు ఆమెకు కనీస పోటీని కూడా ఇవ్వలేక పోయారు. ఇక జర్మనీ క్రీడాకారిని పెడెన్జ్ క్రిస్టిన్ 66.86 మీటర్లతో రజతం సాధించింది. క్యూబా అథ్లెట్ పెరెజ్ యామికి కాంస్యం దక్కింది.