రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారనున్న బిల్లు
న్యూఢిల్లీ: సోమవారం రాజ్యసభలోనూ వాయిదాలపర్వం కొనసాగింది. పలుమార్లు వాయిదా పడిన రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సమావేశమైంది. అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రెండు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు. అందులో ఒకటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ సవరణ బిల్లు2021 కాగా, మరొకటి ఇన్ల్యాండ్ వెసెల్స్ బిల్లు2021. ఇన్ల్యాండ్ వెసెల్స్ బిల్లును ఓడరేవులు, నౌకాయానంశాఖమంత్రి సర్బానందసోనోవాల్ సభలో ప్రవేశపెట్టగా సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు లోక్సభ జులై 29న ఆమోదం తెలిపింది. దాంతో, రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం బిల్లు చట్టంగా అమలులోకి రానున్నది. ప్రాదేశిక జలాల్లో నావిగేషన్కు దేశవ్యాప్తంగా ఒకే విధమైన చట్టాలు అమలయ్యేలా ఈ బిల్లును రూపొందించారు.
జులై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైననాటి నుంచి ఉభయసభల్లో ఎలాంటి చర్చలూ జరగకుండానే నిరంతరం వాయిదా పడుతూ వస్తున్నాయి. పెగాసస్ స్పైవేర్ ద్వారా ప్రతిపక్ష నేతలుసహా ప్రముఖుల ఫోన్లపై నిఘా, వ్యవసాయ చట్టాలు, పెట్రోల్ ధరల పెరుగుదల,తదితర అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు పట్టుపట్టడం, అందుకు అధికార పక్షం నిరాకరించడం సర్వసాధారణమైంది.