కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మధుయాష్కీ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి ఎదుగుదలకు సోనియానే కారణమని ఆయన గుర్తు చేశారు. పార్టీ నిర్ణయం కాదని వైఎస్ విజయమ్మ సమ్మేళనానికి వెళ్లడం పార్టీని నష్టపర్చడమేనని మధుయాష్కీ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా విజయమ్మ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి సమర్థిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో వుంటూ కాంగ్రెస్కు వెన్నుపోటు పొడవద్దని మధుయాష్కీ హితవు పలికారు. సీతక్కపై వ్యాఖ్యలు సంస్కారం లేని వాళ్లు చేసేవని ఆయన మండిపడ్డారు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి 12వ వర్థంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హాజరైన సంగతి విదితమే. వైఎస్ఆర్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని తాను ఈ సమావేశానికి వెళ్తున్నట్లుగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. ఈ సమావేశం రాజకీయాలకు అతీతమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఎవరూ వెళ్లొద్దని కాంగ్రెస్ పార్టీ నేతలను ఆదేశించింది. అయినప్పటికీ కోమటిరెడ్డి ఈ సమ్మేళనానికి హాజరవ్వడం కలకలం రేపింది.