ముగ్గురు సైనికులు మృతి చెక్పోస్టే టార్గెట్
కరాచీ : పాకిస్థాన్లో తాలిబన్ సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో కనీసం నలుగురు సైనికులు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. పాకిస్థాన్లో నిషేధిత తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) సంస్థకు చెందిన ఓ మానవ బాంబు ఆదివారం ఉదయం బైక్పై వచ్చి ఈ దాడికి దిగి తనను తాను పేల్చుకున్నాడు. కల్లోలిత బెలూచిస్థాన్ ప్రాంతంలోని క్వెట్టాలో మస్తుంగ రోడ్లో ఉన్న సరిహద్దు బలగాలు (ఎఫ్సి) చెక్పోస్టును లక్షంగా చేసుకునే ఆత్మాహుతి దాడి జరిగిందని క్వెట్టా డిప్యూటీ ఐజి అజహర్ అక్రమ్ తెలిపారు.
మృతి చెందిన వారు, గాయపడ్డవారు భద్రతా బలగాలకు చెందిన వారే, గాయపడ్డ వారిలో 18 మంది వరకూ ఎఫ్సికి చెందిన వారే ఉన్నారని వెల్లడించారు. క్షతగాత్రులలో ఇద్దరు సమీపంలో ఉన్న ఇతరులని తెలిపారు. చికిత్స పొందుతున్న వీరిలో కొందరి పరిస్థితి విషమంగా మారింది. ఇక్కడ జరిగింది ఉగ్రవాద ఆత్మాహుతి దాడి అని, సరిగ్గా ఇక్కడి సోనా ఖాన్ చెక్పోస్టు వద్దనే గురి చూసుకుని మానవ బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుందని బెలూచిస్థాన్కు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం తెలిపింది. ఘటనకు తామే బాధ్యులమని టిటిపి ఆ తరువాత ప్రకటించింది. ఈ ఘటనను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన వెలువరించారు.