హైదరాబాద్: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి‘. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు పవన్ సి.హెచ్. మీడియాతో మాట్లాడుతూ.. “ఒక సంగీత విభావరిలో ఎ.ఆర్.రెహమాన్ నా పాటలు విని, వచ్చి కలవమని అన్నారు. నా సంగీతం, కంపోజిషన్ ఆయనకు బాగా నచ్చాయని చెప్పి సహాయకుడిగా పెట్టుకున్నారు. అలా రెహమాన్తో శివాజీ, రోబో, సర్కార్ తదితర చిత్రాలకు పనిచేశాను. ఫిదా సినిమా టైమ్ నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గర పనిచేసేందుకు ప్రయత్నిస్తూ వచ్చాను. ఫిదాకు నేను పంపిన పాటలు ఆయనకు నచ్చినా, ఆ సినిమా చాలా ముఖ్యమని కొత్తవాళ్లతో రిస్క్ చేయలేనని చెప్పి వద్దన్నారు. కానీ ఆయనతో టచ్ లో ఉన్నాను. ఇక ‘లవ్ స్టోరి’ సినిమాకు శేఖర్ కమ్ముల పిలిచి అవకాశం ఇచ్చారు. ముందు కొన్ని సందర్భాలు చెప్పి ట్యూన్స్ చేయమన్నారు.
ఆ తర్వాత ‘నువ్వు సినిమాకు పనిచేస్తున్నావు’ అని చెప్పి సర్ప్రైజ్ చేశారు. అప్పటిదాకా చేసిన పాటలన్నీ బ్యాంక్లా పనికొచ్చాయి. లవ్ స్టోరి సినిమా ఒక ఎమోషనల్, ఇంటెన్స్, డెప్త్ ఉన్న సినిమా. ఈ చిత్రానికి శేఖర్కమ్ముల మాకు చెప్పిన విషయం ఒకటే.. ‘పాటలు సందర్భాన్ని ప్రతిబింబించాలి… అంతకంటే ఇంకేం వద్దు’ అని అన్నారు. శేఖర్కమ్ములకి ఫోక్ సాంగ్స్ అంటే ఎంతో ఇష్టం. ‘సారంగ దరియా…’ పాటను మళ్లీ బాగా చేయాలని చెప్పి చేయించారు. ‘లవ్ స్టోరి’ పాటలు ఇన్ని మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడంతో కొత్త సంగీత దర్శకుడిగా చాలా సంతృప్తిగా ఉంది. ఈ పాటలు రెహమాన్కి పంపాలంటే భయమేసింది. కానీ నా మిత్రులు కొందరు ఆయనకు నా పాటలు బాగున్నాయని చెప్పారట. తమన్ సంగీతాన్ని చాలా ఇష్టపడతాను. ఇక మంచి చిత్రాలు చేసి సంగీత దర్శకుడిగా నాకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకోవాలనేది నా లక్ష్యం”అని అన్నారు.
Music Director Pawan about ‘Love Story’