అత్యవసర శాఖలకు సెలవు నుంచి మినహాయింపు
ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్ననట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. భారీ వర్షాలపై సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో సిఎం ఆదేశాల మేరకు తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిని సిఎస్ ఆదేశించారు. అయితే, అత్యవసర శాఖలైన రెవిన్యూ, పోలీస్, ఫైర్ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు విధి నిర్వహణలో ఉండాలని సిఎస్ పేర్కొన్నారు. అలాగే భారీ వర్షాల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని సిఎస్ ఆదేశించారు.